గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించండి!
ABN , Publish Date - May 10 , 2025 | 01:55 AM
నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు.

ఇళ్ల నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష
అమలాపురం, మే9(ఆంధ్రజ్యోతి): నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. అమలాపురంలో ని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గృహనిర్మాణ సంస్థ ఇంజనీర్లతో ఇళ్ల నిర్మాణాల పు రోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చేపట్టిన గృహాల్లో 61 శాతం మాత్రమే పురోగతి సాధించారని, మరో రెండు వారాల్లో నిర్మాణాలను తుది దశకు చేరుకునేలా అధికారులు కృషిచేసి 80 శాతం ప్రగతి సాధించాలని కోరారు. పీఎం ఆవాస్యోజన, అర్బన్ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం అందరికీ గృహనిర్మాణం అమలుచేస్తోందని, పట్టణ ప్రాంతాలు, మురికివాడల నివాసితులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఇళ్లు ఏర్పాటుచేయడంలో ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. మధ్యలో నిలిచిపోయిన గృహాలను ప్రభుత్వం ప్రకటించిన అదనపు సాయంతో పూర్తిచేసి లక్ష్యాలు చేరుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. వ్యక్తిగత గృహనిర్మాణాలతోపాటు గ్రామీణ గృహనిర్మాణ కార్యక్రమాలను వేగవంతంగా అమలుచేయాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివశిస్తున్న కుటుంబాలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన పక్కా ఇంటిని నిర్మించాలని ఆదేశించారు. ఇంజనీర్లు పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. సిబ్బంది కొరత ఉంటే సచివాలయ ఇంజనీర్లను నియమించుకోవచ్చ ని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, ఆ మేరకు ఇంజనీర్లను నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షలో గృహనిర్మాణశాఖ పీడీ ఎంవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.