Share News

హైఅలర్ట్‌!

ABN , Publish Date - May 10 , 2025 | 01:53 AM

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో దేశ సంపదలో కీలకంగా ఉండే కృష్ణా గోదావరి బేసిన్‌ పరిధిలోని చమురు, సహజ వాయువు క్షేత్రాల వద్ద హైఅలర్ట్‌ ప్రకటించారు.

హైఅలర్ట్‌!
బాంబుల దాడి జరిగితే ఏం చేయాలనేదానిపై మామిడికుదురు మండలం నగరంలో శిక్షణ

భద్రత.. కట్టుదిట్టం

తీరాన ముమ్మర గస్తీ

కోస్ట్‌గార్డ్‌, మెరైన్‌ బృందాల తనిఖీ

చమురు నిక్షేపాలకు ప్రత్యేక రక్షణ

విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌

800 ఏపీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది

3 రోజులుగా సాగుతున్న మాక్‌డ్రిల్‌

భారత్‌ - పాకిస్తాన్‌ యుద్ధ వాతావరణం నేపథ్యంలో రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. పోర్టులు, నౌకాశ్రయాల్లో భద్రత పెంచింది. సముద్ర జలాల ద్వారా ముష్కరులు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలతో తీర ప్రాంతాల్లో భద్రతను రెండంచెల స్థాయికి పెంచారు. జిల్లా పోలీసులు, కోస్టు గార్డ్‌ సిబ్బంది, కస్టమ్స్‌, పోర్టు అధికారులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో నిరంతరం నిఘాను పెంచుతూ తీరంలోని కదలికలను పరిశీలిస్తున్నారు. షిప్‌యార్డులు, సీ పోర్టుల్లో ఉన్న వీదేశీ నౌకలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరోవైపు మధురపూడి విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

- (అమలాపురం/ కాకినాడ/రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో దేశ సంపదలో కీలకంగా ఉండే కృష్ణా గోదావరి బేసిన్‌ పరిధిలోని చమురు, సహజ వాయువు క్షేత్రాల వద్ద హైఅలర్ట్‌ ప్రకటించారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న అపార చమురు నిక్షేపాలు కలిగిన ప్లాంట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శాటిలైట్‌ ద్వారా నిఘా పెంచారు. సముద్రం వెంబడి కోస్టుగార్డు, మెరైన్‌ పోలీసుల గస్తీ నౌకలు పర్యవేక్షిస్తున్నాయి. గత మూడు రోజులుగా కోనసీమలోని సముద్ర తీరం వెంబడి ఉన్న చమురు, గ్యాస్‌ నిక్షేపాల కేంద్రాల వద్ద సీఐఎస్‌ఎఫ్‌, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో సైరన్‌ వినిపిస్తే ప్రజలు ఎలా స్పందించాలి అనే దానిపై కూడా వారు స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. రహదారులపై అర్ధరాత్రుళ్లు తనిఖీ లు చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? వంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. మొత్తంగా కోస్తా తీరంలో బలగాలన్నీ అప్రమత్తమయ్యాయి.

తీరాన నిఘా...

కోనసీమ జిల్లా పరిధిలోని అంతర్వేది నుంచి ఐ.పోలవరం మండలం హోప్‌ఐలాం డ్‌ వరకు ఉన్న సముద్ర తీరం వెంబడి అపార చమురు, సహజ వాయువుల నిక్షేప కేంద్రాలు ఉన్నాయి. సముద్రపు లోతు జలాల్లో బావుల ద్వారా ఉత్పత్తి అయ్యే గ్యాస్‌, ఆయిల్‌ను ప్లాంట్ల ద్వారా శుద్ధిచేసి విశాఖ లేదా ఇతర రాష్ట్రాలకు తరలించడం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని ఆ సంస్థలు ఆర్జిస్తున్నాయి. జిల్లా పరిధిలోని రిలయన్స్‌, జీఎస్‌పీఎస్‌, ఎస్‌.యానాంలోని వేదాంత, ఓడలరేవులోని ఓఎన్జీసీ ప్లాంటు, కేశనపల్లి, కరవాక ప్రాంతాల్లో ఉన్న ప్లాంట్లతో పాటు అత్యంత కీలకంగా ఉండే నగరంలోని జీసీఎస్‌లతో పాటు కోనసీమవ్యాప్తంగా 30కు పైగా ప్రాంతాల్లో చమురు, సహజవాయువుల అన్వేషణ కేంద్రాలు ఉన్నాయి. సీఎస్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీస్‌తో పాటు స్థానికంగా ఉండే వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల్లోని ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో రూరల్‌ సీఐ ప్రశాంత్‌కుమార్‌, మెరైన్‌ పోలీసులు, వేదాంత సిబ్బంది స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాంట్ల పరిసరాల్లో ప్రజల కదలికలపై నిఘా ఉంచాల్సిందిగా సూచించారు. చమురు క్షేత్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఇతర వ్యక్తుల సంచారంపై నిఘా ఉంచాలని, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, వారి కదలికలపై కూడా నిఘాను పటిష్టం చేయాల్సిందిగా సూచించారు. సముద్రపులోతు జలాల్లో ఉన్న వివిధ సంస్థలకు చెందిన ఆఫ్‌షోర్‌ ప్లాట్‌ఫారాల వద్దకు నౌకలు, భారీ బోట్‌లు వంటివి ప్రయాణించకుండా కోస్ట్‌గార్డు బృందాలు నిఘా ఉంచాయి. రిలయన్స్‌, గుజరాత్‌ పెట్రోలియం, ఓఎన్జీసీ సంస్థలతోపాటు ఇతర ప్రైవేటు సంస్థలకు చెందిన ఫ్లాట్‌ఫారాల ద్వారా చమురు, సహజవాయువుల అన్వేషణ జరుగుతోంది. మరో వైపు కాకినాడ యాంకరేజ్‌, డీప్‌వాటర్‌ పోర్టులో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. కేసీపీఎల్‌లో కూడా వచ్చే, వెళ్లే షిప్‌లను పరిశీలిస్తున్నారు. సముద్రంలో కేజీ బేసిన్‌ చమురు క్షేత్రాలు సమీపంలోకి ఎవరూ రాకుండా ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నారు. సీకోస్టల్‌లో ఎక్కువగా కర్మాగారాలు, ఆయిల్‌ రిఫైనరీలు అధికంగా ఉన్న నేపథ్యంలో స్థానిక సెక్యూరిటీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు తీర ప్రాంతంలో పెట్రోలియం స్టోరేజ్‌ కేంద్రాలు, కర్మాగారాల్లో భద్రతా సిబ్బందిని జిల్లా పోలీ సు యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఐవో సీఎల్‌, బీపీసీఎల్‌,హెచ్‌పీసీఎల్‌ వంటి పెట్రోలియం స్టోరేజ్‌ కేంద్రాలు, కార్మాగారాల్లో ఇత రులను అనుమతించొద్దని భద్రత సిబ్బందికి హెచ్చరికలు జారీచేశారు. అలాగే బాంబ్‌ స్క్వాడ్స్‌, డ్రోన్‌ బృందాలు, కోస్ట్‌ గార్డ్స్‌, కేఎస్‌పీఎల్‌ సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.

విమానాశ్రయంలో అణువణువు తనిఖీలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక రక్షక దళం(ఏపీఎస్‌పీఎఫ్‌) అప్రమత్త మైంది.కమాండెంట్‌ కేఎన్‌ రావు స్వీయ పర్యవేక్ష ణలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరిలోని అన్నవరం దేవస్థానం, కాకినాడ రిల యన్స్‌,ఓఎన్‌జీసీ రిగ్‌లు, యాంకరేజీ పోర్టు, రాజమండ్రి ఓఎన్‌జీసీ బేస్‌ పరిధిలోని కోనసీమ జిల్లాలోని కృష్ణా-గోదావరి బేసిన్‌ బావులు, రాజ మహేంద్రవరం విమానాశ్రయం, బ్యాంకు చెస్ట్‌ల కు ఏపీ ఎస్‌పీఎఫ్‌ సుమారు 800 మంది సుశిక్షి తులైన పోలీసులతో భద్రత కల్పిస్తోంది. కోనసీ మలోని గ్యాస్‌ పైపులైన్లను నిరంతరంగా పహారా కాస్తున్నారు. రాజమండ్రి ఎయిర్‌ పోర్టులో రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీ వంటి హోదాలతో సంబంధం లేకుండా ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్నిచోట్లా నిఘా ముమ్మరం చేశారు. మెటల్‌, లగేజీ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. సందర్శకు లను ఇప్పటికే నిషేధించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో స్వీయ రక్షణపై మాక్‌ డ్రిల్‌ నిర్వహిం చారు. రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్‌), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), సిబ్బంది ఎప్పుడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎలా స్పం దించాలనే దానిపై అవగాహన కల్పించారు.

దేశ సరిహద్దుల్లో..

మా కుమారుడు దేశ రక్షణలో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశ రక్షణకై పోరాడడం మామూలు విషయం కాదు.. ప్రాణాలెదురొడ్డి పోరాడాలి. మనం ఇక్కడ భయపడితే వారు అక్కడ భయపడతారు. అలా కాదు.. మనం ధైర్యంగా ఉండాలి.. వారిలో ధైర్యాన్ని నింపాలి.. ఇదీ అల్లవరం మండలం ఈటివారి గ్రామానికి చెందిన యీటి చిన శివకుమార్‌ తల్లిదండ్రులు గోపాలరావు, కాశీరామేశ్వరి స్పందన. మా రెండో అబ్బాయి యీటి చినశివకుమార్‌ 20 ఏళ్లుగా ఆర్మీ ఎయిడ్‌ డిఫెన్స్‌ విభాగంలో విధుల్లో ఉంటున్నాడు. ప్రస్తుతం భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో చినశివకుమార్‌ జమ్మూ బోర్డర్‌ సమీపాన ఉద్దంపూర్‌లో సైనిక విధుల్లో ఉన్నాడని వారు తెలిపారు. కుటుంబ పరంగా ఆందోళన కలిగిస్తున్నా, దేశం తరపున పోరాడుతున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 01:53 AM