ఆసుపత్రిలో సమస్యలుంటే మీడియాకు చెప్పొద్దు
ABN , Publish Date - May 09 , 2025 | 01:25 AM
ప్రభుత్వ బోధనాసుపత్రిలో విధుల నిర్వహణ సమయంలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత విభాగాల హెచ్వోడీలు, ఇన్ఛార్జిల ద్వారా కార్యాలయం పరిపాలనాధికారులకు తెలియజేయాలని ప్రభుత్వ బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ స్పష్టం చేశారు. ఈమేరకు ఆమె గురువారం ఒక సర్క్యులర్ జారీ చేశారు.

హెచ్వోడీలకే చెప్పండి
బయట వ్యక్తులకు చెబితే ఊరుకోం
ఆసుపత్రి సిబ్బందికి సూపరింటెండెంట్ హెచ్చరిక
ప్రభుత్వ బోధనాసుపత్రిలో తనిఖీలు
రాజమహేంద్రవరం అర్బన్, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనాసుపత్రిలో విధుల నిర్వహణ సమయంలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత విభాగాల హెచ్వోడీలు, ఇన్ఛార్జిల ద్వారా కార్యాలయం పరిపాలనాధికారులకు తెలియజేయాలని ప్రభుత్వ బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ స్పష్టం చేశారు. ఈమేరకు ఆమె గురువారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. ప్రాపర్ ఛానల్ ద్వారా కాకుండా మీడియా, ప్రెస్, బయటి వ్యక్తులు, ఇతర విభాగాల ప్రతినిధులకు నేరుగా తెలియజేస్తే దాన్ని సీరియస్గా పరిగణిస్తామని, తమ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
ప్రతి మూడు నెలలకు రిక్వయిర్మెంట్ తెలపాలి
వైద్యసేవలకు అవసరమైన మందులు, సర్జికల్స్, ల్యాబ్ ఐటమ్స్ తదితర రిక్వయిర్మెంట్స్ను సంబంధిత విభాగాల హెచ్వోడీలు ప్రతి మూడు నెలలకు ఒకసారి తమకు అందజేయాలని సూపరింటెండెంట్ తెలిపారు. ఫార్మసీ సూపర్వైజర్ హెచ్వోడీలతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
కాగా, సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ గురువారం ప్రభుత్వాసుపత్రిలోని అన్ని విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంసీహెచ్ బ్లాకు, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, నర్సింగ్స్టాఫ్కు సూచనలు చేశారు. మెడికల్ కాలేజీ పనులు కూడా పరిశీలించి, నిర్మాణ పురోగతిపై ఎపీఎంఎస్ఐడీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.