జీవో నెం.4పై ప్రభుత్వం పునరాలోచించాలి
ABN , Publish Date - May 21 , 2025 | 12:41 AM
గ్రామ సచివాలయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెం.4పై పునరాలోచించాలంటూ వీర్వోలు మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఉప్పలగుప్తం, మే 20(ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెం.4పై పునరాలోచించాలంటూ వీర్వోలు మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. క్లస్టర్ విధానంలో సర్దుబాటులో భాగంగా మిగిలిన వీఆర్వోలను ఏ ప్రాతిపదికన, ఏ శాఖలో సర్దుబాటు చేస్తారో చెప్పకుండా తమను అయోమయంలో పడేశారని వినతి పత్రంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సచివాలయ పరిధిలోనే రీసర్వే, రెవెన్యూ సదస్సులు, ఇతర రోజువారీ విధులే కాకుండా ప్రభుత్వ ఆదేశాలతో పలు అత్యవసర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే ఎందరో వీఆర్వోలు అనారోగ్యం పాలయ్యారని ఆవేదన చెందారు. రెండు సచివాలయాలకు ఒక వీఆర్వో విధుల నిర్వహణ సాధ్యమయ్యే పనికాదన్నారు. ప్రభుత్వం ఈ జీవోపై తక్షణం పునరాలోచన చేయాలని కోరారు. వీఆర్వోల మండల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూర్ అహ్మద్ ఆలీషా, ఎస్కే వలీ, నాగులపల్లి పళ్ళంరాజు, కోటిపల్లి వెంకటరమణ, శివన్నారాయణ, విన్నా ప్రసాద్, అవిడి రాము, పెట్టా బాలాజీ, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.