మత్స్యకార వేట నిషేధ భృతి.. రూ.49.54 కోట్లు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:35 AM
మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా జిల్లాలో 24,769 మంది అర్హులైన లబ్ధిదారుల ఖాతా లకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున రూ.49.54 కోట్ల సముద్ర వేట నిషేధకాల భృతిని నేరుగా వారి ఖాతాలకే జమచేయడం జరిగిందని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ రాహుల్మీనా తెలిపారు.
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా జిల్లాలో 24,769 మంది అర్హులైన లబ్ధిదారుల ఖాతా లకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున రూ.49.54 కోట్ల సముద్ర వేట నిషేధకాల భృతిని నేరుగా వారి ఖాతాలకే జమచేయడం జరిగిందని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ రాహుల్మీనా తెలిపారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈనెల 15వ తేదీ నుంచి జూన్ 14 వరకు రెండు నెలల సముద్ర వేట నిషేధకాలానికి మత్సకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు చొప్పున ఇస్తున్న భృతి పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో వివిధ రకాల చేపల జాతులు ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల కాలంలో గుడ్లు, పిల్లలను పెట్టి సంతతివృద్ధి చేసుకునే బ్రీడింగ్ కాలమని, అందుకే ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలలపాటు ప్రభుత్వం సముద్ర చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తోందన్నారు. సముద్ర వేట నిషేధ రెండు నెలల కాలంలో జీవ నోపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మత్స్యశాఖాధికారి కృష్ణారావు, క్షేత్రాధికారులు, మత్స్య సహకార సంఘం నాయకులు రంగా రావు, మత్స్యకార సొసైటీల నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.