Share News

ఆశలపై నీళ్లు

ABN , Publish Date - May 10 , 2025 | 01:50 AM

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి మాసూళ్లకు తీవ్ర విఘాతం కలిగింది.

ఆశలపై నీళ్లు
మండపేటలో వర్షంలో నానుతున్న ధాన్యం

జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ.. అకాల వర్షాలు అన్నదాతలకు శాపంగా మారాయి. గత నాలుగైదు రోజులుగా రైతులను ఈ వానలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కోనసీమ ప్రాంతంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 12 గంటల నుంచి రెండు గంటల మధ్య కురిసిన ఈ వర్షానికి కల్లాల్లో, రోడ్ల పక్కన ఎండబెట్టిన ధాన్యం తడిసిపోయింది. అప్పటికప్పుడు పంట కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడినా కొన్నిచోట్ల నీట తడవక తప్పలేదు. ఈసారి పంటలు ఆశాజనకంగా ఉండడంతో రైతాంగం దిగుబడులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అకాల వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

జిల్లాలో భారీ వర్షం

ఈదురుగాలుల బీభత్సం

తడిసిన ధాన్యం

ఆవేదన చెందుతున్న అన్నదాతలు

మండపేట/ఆలమూరు/ఆత్రేయపురం/అంబాజీపేట/అయినవిల్లి/ రావులపాలెం, మే9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి మాసూళ్లకు తీవ్ర విఘాతం కలిగింది. ఇప్పటికే చాలావరకు మాసూలు పనులు పూర్తిచేసి కల్లాల్లో, రోడ్ల పక్కన రైతులు ఆర బెట్టుకున్న ధాన్యం తడిసిపోయింది. ఎక్కడికక్కడ ధాన్యం రాశులపై బరకాలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భారీ వర్షం కావడంతో ఆయాచోట్ల నీళ్లు నిలిచిపోయి పంట తడిసిపోయింది. మండపేట పరిసరాల్లో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ధాన్యం రాశుల చుట్టూ వర్షం నీరు నిలిచిపోయింది. ఉదయం ఎండకాయ డంతో రైతులు పలుచోట్ల ధాన్యం ఆరబెట్టుకున్నారు. ఆకస్మికంగా మబ్బులు పట్టి వర్షం వచ్చేయడంతో ధాన్యం నీటిపాలైంది. తడిసిన ధాన్యం రంగుమారుతుందని.. సరైన ధర కూడా రాదని రైతులు వాపోతున్నారు. ఆలమూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా ధాన్యం రాశులు తడిచిపోయాయి. బరకాలు గాలికి ఎగిరిపోవడంతోపాటు వర్షపునీరు రాశుల కిందకు రావడంతో ధాన్యం తడిసిపోయినట్టు రైతులు చెబుతున్నారు. ఆత్రేయపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్ల మీదే బరకాలు కప్పి ఉంచిన ధాన్యం తడిసిపోయింది. అంబాజీపేట మండలంలోనూ ఇదే పరిస్థితి. ఈ మండలంలో 75 శాతం వరికోతలు పూర్తికాగా, ధాన్యం ఆయా కల్లాల్లోనే రైతులు భద్రపరుచుకున్నారు. రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. అయినవిల్లి మండలంలో అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. కోసిన పంటను ఆరబెట్టుకునే దశలో వర్షాలు పడి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాతావరణం నేపథ్యంలో బస్తా రూ.1725కు కొనుగోలు చేయాల్సి ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.1200కు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. రావులపాలెం మండలంలో దాళ్వా మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులను కలవరపెడుతున్నాయి. ఉదయం ఎండకాస్తుండగా, గత రెండు రోజుల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని కుండపోత వర్షం కురవడంతో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోతోంది. ప్రభుత్వం తక్షణం తమ వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులంతా కోరుతున్నారు. లేదంటే అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఉద్యానవన పంటలకు మేలు చేస్తాయని ఆయా రైతులు చెబుతున్నారు.

Updated Date - May 10 , 2025 | 01:50 AM