అపరిచితులతో చాటింగ్ చేయొద్దు: డీఎస్పీ
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:19 AM
సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్, స్కైప్లో అపరిచితులతో చాటింగ్ చేయవద్దని ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య పేర్కొన్నారు. బిక్కవోలులోని శ్రీప్రజ్ఞా కళాశాల, ఊలపల్లి అంగన్వాడీ కేంద్రంలో సైబర్ నేరాలు, గంజాయి, మహిళల భద్రతపై డీఎస్పీ బి.విద్య, జిల్లా సైబర్ ల్యాబ్ పోలీసులు శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించారు.
బిక్కవోలులో గంజాయి, సైబర్ నేరాలు, మహిళల భద్రతలపై అవగాహన సదస్సు
బిక్కవోలు, జూలై 25(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్, స్కైప్లో అపరిచితులతో చాటింగ్ చేయవద్దని ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య పేర్కొన్నారు. బిక్కవోలులోని శ్రీప్రజ్ఞా కళాశాల, ఊలపల్లి అంగన్వాడీ కేంద్రంలో సైబర్ నేరాలు, గంజాయి, మహిళల భద్రతపై డీఎస్పీ బి.విద్య, జిల్లా సైబర్ ల్యాబ్ పోలీసులు శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహిళలు, బాలికల రక్షణకు మహిళా చట్టాల ద్వారా కల్పిస్తున్న హక్కులు, స్వీయ రక్షణపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. అనవసర లింక్లు, అప్లికేషన్లను క్లిక్ చేయడం వల్ల కలిగే అనర్ధాల వివరించారు. ఎస్ఐ వి.రవిచంద్రకుమార్ మాట్లాడుతూ గంజాయి, చెడు వ్యసనాలకు దూరంగా వుండాలని, అటువంటి నేరస్తుల కదలికల గూర్చి సమాచారం ఇవ్వాలన్నారు. ఓటీపీ ఫ్రాడ్, ఏటీఎం కార్డు క్లోనింగ్ ఫ్రాడ్లపై అప్రమత్తంగా వుండాలన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరస్తుల వద్దకు చేరకుండా ఎలా భద్రపరచుకోవాలో అనే అంశంపై మెళకువలను సైబర్ పోలీసులు నేర్పించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1960 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలన్నారు. జిల్లా సైబర్ ల్యాబ్ సిబ్బంది వైవీ. సురేష్, పి.దుర్గాప్రసాద్, డి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.