Share News

డీజిల్‌ మాఫియా!

ABN , Publish Date - Jun 06 , 2025 | 01:27 AM

ఇప్పటి వరకూ ఇసుక మాఫియా చూశాం.. మట్టి మాఫియా.. డీజిల్‌ మాఫియా ఎక్కడైనా చూశారా.. చూడలేదంటారా.. అయితే ఇప్పుడు చూసేయవచ్చు.

డీజిల్‌ మాఫియా!
పురుషోత్తపల్లిలో బయోడీజిల్‌ బంక్‌

బయోడీజిల్‌ పేరుతో బంక్‌ ఏర్పాటు

యానాం తదితర ప్రాంతాల నుంచి దిగుమతి

ప్రత్యేకంగా హెచ్‌పీ స్టిక్టర్‌ ఒక ట్యాంకర్‌

బయట లీటర్‌ రూ.96.. ఇక్కడ రూ.75

పురుషోత్తపల్లి కేంద్రంగా సాగుతున్న దందా

నిడదవోలు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : ఇప్పటి వరకూ ఇసుక మాఫియా చూశాం.. మట్టి మాఫియా.. డీజిల్‌ మాఫియా ఎక్కడైనా చూశారా.. చూడలేదంటారా.. అయితే ఇప్పుడు చూసేయవచ్చు. ఒకసారి నిడదవోలు మండలం పురుషోత్తపల్లి వెళితే అక్కడ ఏకంగా ఒక బంక్‌నే ఏర్పాటు చేసేశారు.. యథేచ్ఛగా బయోడీజిల్‌ పేరుతో డీజిల్‌ విక్రయిస్తూ దందాకు తెరలేపారు.. అది కూడా హెచ్‌పీ స్టిక్కర్‌తో ఉన్న ట్యాంకర్‌ను ఒక బొలెరో వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి డీజిల్‌ తరలిస్తూ దందా సాగిస్తున్నారు. సాధారణంగా ఏ బంక్‌లో చూసిన లీటర్‌ డీజిల్‌ రూ. 96ల వరకూ ఉంది. . ఈ బంక్‌ నుంచి డోర్‌ డెలివరీ చేసినా రూ.75లు మాత్రమే. అలా ఎలా అంటారా.. ఒకసారి దందా ఎలా సాగిస్తున్నారో మీరే తెలుసుకోండి మరి.. ఆ దారిలో వెళ్లే వాహనాలు చాలా తక్కువ.. అయి తే ఆ దారిలో మాత్రం ఒక బంక్‌ ఉంటుంది.. చూసిన వారెవరికైనా ఇక్కడ బంక్‌ ఎందుకు అనే అనుమానం రాక మానదు.. ఎందుకంటే డీజిల్‌ బంక్‌ అనే బోర్డు తప్ప ఇంకేం ఉండదు. దీనిపై అనుమానం వచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీస్తే అసలు దందా బయటపడింది. మట్టి, ఇసుకను మించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతూ డీజిల్‌ మాఫియా చెలరేగిపోతుం దనే విషయం బయటపడింది. పేరుకు మాత్ర మే బయో డీజిల్‌ బంక్‌ ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి డీజిల్‌తో పాటుగా బయోడీజిల్‌ పేరుతో క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని డీజిల్‌ మాఫియాకు తెరలేపుతున్నారు. ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీ హెచ్‌.పీ పేరుతో ఏకంగా ట్యాంకర్‌ ఉన్న వాహనాన్ని తయారు చేయించి అడిగిన చోటుకు నేరుగా వచ్చి అన్‌లోడ్‌ చేసి వెళ్లిపోతున్నారు.పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టి డీజి ల్‌ దందా నడుపుతున్నా ప్రభుత్వ అధికారుల మౌనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బయోడీజిల్‌ పేరు ఎక్కడ?

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండ లం గోపవరం నుంచి డి.ముప్పవరం వెళ్లే దారి లో పురుషోత్తపల్లి సమీపంలో బయో డీజిల్‌ బంక్‌ ఏర్పాటైంది.మాఫియా ఈ బంక్‌ను అడ్డాగా చేసుకుని డీజిల్‌ బంక్‌ అంటూ బోర్డు పెట్టేసింది. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి పరి శ్రమల క్రూడాయిల్‌ను తెప్పిస్తూ దీంతో పాటు గా అప్పుడప్పుడు బయోడీజిల్‌ దిగుమతి చేసు కుంటున్నారు.ఆ తరువాత లారీ యజమా ను లను బయోడీజిల్‌ అంటూ బురిడీ కొట్టిస్తు న్నారు.కేంద్రపాలిత ప్రాంతం యానాం నుంచి దొడ్డి దారిన బిల్లులు లేకుండా తక్కువ ధరకు డీజిల్‌ తెప్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.ఈ డీజిల్‌ను ఇసుక ర్యాంపుల వద్ద ఇసుక లారీలకు ప్రత్యేకంగా హెచ్‌పీ స్టిక్కర్‌తో తయారు చేయించిన వాహ నం ద్వారా అనధికారికంగా సరఫరా చేస్తున్నారు.

డీజిల్‌ లీటర్‌ రూ.75

ఈ డీజిల్‌ దందా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి వచ్చే అనధికార డీజిల్‌తో పాటుగా బయో డీజిల్‌ అంటూ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రెండో రకం క్రూడాయిల్‌ను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. దీనిపై కూపీ లాగగా ఆ బంక్‌ పేరుతో ఒక ట్యాంకర్‌ బయో డీజిల్‌ బిల్లుతో వస్తే మరో ఆరు ట్యాంకర్ల క్రూడాయిల్‌ అనధికారికంగా వస్తుందని అలాగే యానాం నుంచి డీజిల్‌ ఎటువంటి బిల్లులు లేకుండా లారీలకు లారీలు దొడ్డిదారిన ఇక్క డకు వస్తున్న విషయం బట్టబయలైంది. పురు షోత్తపల్లి బంకు నుంచి యఽథేచ్ఛగా డీజిల్‌ దందా సాగుతున్నా అధికారుల మౌనం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పెట్రోల్‌ బంకుల్లో సుమారు రూ.96లకు లీటర్‌ డీజిల్‌ ధర ఉండగా అడిగిన చోటుకే వచ్చి సుమారు రూ.75లకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డీజిల్‌, బయోడీజిల్‌, డీజల్‌ పేరుతో క్రూడ్‌ అయిల్‌ సరఫరా చేస్తున్నారు.ఇసుక లారీ యజమాను లు ఇవి తక్కువ ధరకు రావడం తమకు కావ లసిన చోటుకు వచ్చి అందించడంతో ఈ డీజిల్‌ మాఫియాకు పూర్తిగా సహకరిస్తున్నారు.ఈ డీ జిల్‌ మాఫియాపై అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందనలేదని ప్రముఖ కార్పొరేట్‌ కం పెనీ డీజిల్‌ డీలర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్‌.పి.కంపెనీ పేరుతో వాహనం

డీజిల్‌ మాఫియాకు సుమారు 3 వేల లీట ర్లు కలిగిన ట్యాంకర్‌తో బొలేరో వాహనాన్ని సి ద్ధం చేశారు.ఆ ట్యాంకర్‌ వెనుక భాగంలో డీజి ల్‌ కొట్టేందుకు గన్‌, డిజిటల్‌ ఎక్విప్‌ మెంటు ఏర్పాటు చేసింది. దీనిపై ఎవరికి అనుమానం రాకుండా.. అనుమతులు లేకుండానే హెచ్‌పి (హిందుస్థాన్‌ పెట్రోలియం) కంపెనీ లోగోను పెయింట్‌ వేయించేసింది.ఈ వాహనం ముందు నుంచి చూస్తే బొలేరో వాహనంలా కనిపి స్తుం ది. వెనుక చూసే వారికి మాత్రమే ట్యాం కర్‌ లా కనిపిస్తుంది. ఈ వాహనానికి ఎటువంటి అనుమతులు లేకుండానే లారీ స్టాండులో ఉన్న లారీలకు, జిల్లాలోని ఇసుక ర్యాంపుల్లో ఉండే లారీలకు నేరుగా పోయి డీజిల్‌ సరఫరా చేస్తు న్నారు. చూసేవారికి హెచ్‌.పి కంపెనీకి చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌లా నమ్మిస్తూ ఇలా అనధికారి కంగా యఽథేచ్ఛగా డీజిల్‌ దందా సాగిస్తోంది.

Updated Date - Jun 06 , 2025 | 01:27 AM