డీసీపీవో రీ-నోటిఫికేషన్ వెనుక మతలబు ఏమిటో?
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:27 AM
జిల్లా బాలల సంర క్షణ అధికారి (డీసీపీవో) నియామకం గురించి జారీచేసిన నోటిఫి కేషన్ రద్దుచేసి.. మళ్లీ తాజాగా నోటిఫికేషన్ ప్రకటించడం వెనుక పలు ఆరోపణలు వినవస్తున్నాయి.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా బాలల సంర క్షణ అధికారి (డీసీపీవో) నియామకం గురించి జారీచేసిన నోటిఫి కేషన్ రద్దుచేసి.. మళ్లీ తాజాగా నోటిఫికేషన్ ప్రకటించడం వెనుక పలు ఆరోపణలు వినవస్తున్నాయి. బాలల సంరక్షణ కోసం జిల్లాకు ఒక అధికారి ఉంటారు. జిల్లా డీసీపీవో రాజ్కుమార్ ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. ఆ పోస్టు భర్తీ చేయడం కోసం 15రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. సుమారు 90 మంది దరఖాస్తు చేసు కున్నారు. జిల్లా నియామకాల కమిటీ ఇంటర్వ్యూల ద్వారా పోస్టు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల ఆ నోటిఫికేషన్ని రద్దు చేశారు. మంగళవారం రీ-నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో పలు సామాజిక వర్గాలకు వయసు సడలింపు ఇచ్చారు. చివరిగా డీసీపీవోల కోసం 2023 డిసెంబరులో ఇంటర్వ్యూలు జరిగాయి. 2024 జనవరిలో నియామక పత్రాలు అందజేశారు. ఆ నోటిఫికేష న్లో, ఇప్పుడు రద్దు చేసిన నోటిఫికేషన్లో వయసు సడలింపు లేదు. 42 ఏళ్ల వయసులోపు వారు అర్హులు. అయితే వైసీపీ హయాంలో నియమించిన రాష్ట్ర బాలల సంరక్షణ కమిటీలోని వైసీపీ సానుభూతి పరుడైన ఓ సభ్యుడు జిల్లా డీసీపీవో పోస్టుపై కన్నేశారని చెబు తున్నారు. ఆ కమిటీ గడువు ఓ నెలతో ముగుస్తుంది. దీంతో ఆయన వయసు అర్హత పరిధిలోకి రావాలనే ఉద్దేశంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు లేఖ సమర్పించడం ద్వారా 42 ఏళ్లుగా ఉన్న వయసు పరి మితిని 47గా మార్పు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతమంది దరఖాస్తు చేసినా ఆయనకే పోస్టు దక్కేలా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఆ స్థానంలో ఇప్పటివరకూ పని చేసిన రాజ్కుమార్ కూడా రాజమండ్రి మాజీ ఎంపీ భరత్రామ్ అండదండలతో పోస్టు దక్కించుకున్నారని ప్రచారం జరిగింది.