Share News

క్యాన్సర్‌ కలవరం!

ABN , Publish Date - May 07 , 2025 | 12:23 AM

క్యాన్సర్‌.. ఎప్పుడు వస్తుందో.. ఎక్కడ వస్తుందో.. ఎలా వస్తుందో తెలియదు.. ఏదో అనుమానం ఉంటే తప్ప ప్రాథమిక దశలో గుర్తించడం కూడా కష్టమే. నూటికి 50 నుంచి 60 శాతం కేసులు చివరిలోనే గుర్తిస్తారు.. దాంతో సకాలంలో చికిత్స అందక క్యాన్సర్‌కు ఎందరో బలైపో తున్నారు.

క్యాన్సర్‌ కలవరం!

  • ఉమ్మడి జిల్లాలో విజృంభిస్తోన్న మహమ్మారి

  • వేలల్లో అనుమానిత కేసులు

  • 2.0 సర్వేలో 16,432

  • 3.0. సర్వేలో 21వేలుపైనే

  • కాకినాడలోనే 8,383 కేసులు

  • 21 మందికి క్యాన్సర్‌ నిర్ధారణ

  • రాష్ట్రంలోనే కాకినాడ జిల్లా ఫస్ట్‌

  • ఆసుపత్రి ఏర్పాటు యోచన

  • రూ.10 కోట్లతో ప్రతిపాదనలు

  • కాకినాడ కలెక్టర్‌ చొరవ

  • క్యాన్సర్‌ పరీక్షలకూ వాహనం

క్యాన్సర్‌.. ఎప్పుడు వస్తుందో.. ఎక్కడ వస్తుందో.. ఎలా వస్తుందో తెలియదు.. ఏదో అనుమానం ఉంటే తప్ప ప్రాథమిక దశలో గుర్తించడం కూడా కష్టమే. నూటికి 50 నుంచి 60 శాతం కేసులు చివరిలోనే గుర్తిస్తారు.. దాంతో సకాలంలో చికిత్స అందక క్యాన్సర్‌కు ఎందరో బలైపో తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిపిన సర్వే విస్తుపోయే నిజం బయటకు వచ్చింది.. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్యాన్సర్‌ మహమ్మారి విజృంభిస్తోందని తేలింది.. కాకినాడ క్యాన్సర్‌ అనుమానిత కేసుల్లో తొలిస్థానంలో ఉంటే.. తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలు 10, 11వ స్థానాల్లో ఉండడం కలవరపెడుతోంది.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్యాన్స ర్‌ అనుమానిత కేసులు కలవరపెడుతు న్నాయి. వైద్య ఆరోగ్యశాఖ సర్వేలో వేలకు వేలు అనుమానిత కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మండలంలో చూసినా నోటి, సర్వైకల్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ లక్షణాలు ఉన్న బాధితులు ఎక్కువగా తేలుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎన్‌ సీడీ (నాన్‌ కమ్యునబుల్‌ డిసీజ్‌) 2.0 సర్వే లో ఉమ్మడి జిల్లాలో 16,432 మందిలో క్యా న్సర్‌ అనుమానిత లక్షణాలు గుర్తించగా తాజాగా పూర్తయిన ఎన్‌సీడీ 3.0 సర్వేలో ఏకంగా 20వేలకుపైగా కేసులు వెలుగులోకి రావడం క్యాన్సర్‌ తీవ్రతను చాటుతోంది.

అంతకంతకూ విజృంభణ..

రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో క్యాన్సర్‌ కేసులు విజృంభిస్తున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా క్యాన్సర్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష లు నిర్వహించాలని ప్రభుత్వం జనవరిలో ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో ఇంటింటికీ వెళ్లి ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్యాన్సర్‌ తోపాటు పలు రకాల వ్యాధులపై సర్వే చేశారు. హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, లివర్‌ వ్యాధులు సైతం భారీగా ఉమ్మడి జిల్లాలో వెలుగులోకి వస్తున్నా వీటికి మించి భయ పెట్టేలా క్యాన్సర్‌ అనుమానిత కేసులు గుర్తి స్తుండడం కలవరపాటుకు గురిచేస్తోంది.

రాష్ట్రంలో కాకినాడ ఫస్ట్‌..

కాకినాడ జిల్లాలో అత్యధికంగా కేసులు ఉండడం కలవరపెడుతోంది. 2.0 సర్వేలో కాకినాడ జిల్లాలో 6,333 కేసులు గుర్తిం చారు. 3.0 సర్వేలో ఏకంగా 8,383 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు వీరిలో చాలామందికి పూర్తిస్థాయి టెస్ట్‌లు చేయగా 21 మందికి క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. ఇన్ని కేసులతో కాకినాడ జిల్లా రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిచింది. ఈనేపథ్యంలో క్యా న్సర్‌ ఆసుపత్రి నిర్మాణానికి కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ప్రభుత్వానికి రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. నిధులు వేగం గా విడుదలచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎస్సార్‌ నిధుల ద్వారా ప్రత్యేక క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు జరిపే మొబైల్‌ వాహ నాన్ని కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓఎన్జీసీతో మాట్లాడారు. ఈ మొబైల్‌ వాహనం ద్వారా రోజుకు వెయ్యిమందికి టెస్ట్‌లు చేసే ఆధు నిక పరికరాలు అందుబాటులోకి రానున్నా యి. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి టెస్ట్‌లు చేయవచ్చని కలెక్టర్‌ వివ రించారు. తూర్పుగోదావరి జిల్లా 5,103 అనుమానిత క్యాన్సర్‌ కేసులతో పదో స్థా నంలో నిలిచింది. కోనసీమ జిల్లా 4,996 కేసులతో 11వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ఎన్‌సీడీ 2.0 సర్వేలో క్యాన్సర్‌ అను మానిత కేసులు 16,432 తేలాయి.

రూ.10కోట్లతో ఆసుపత్రి..

క్యాన్సర్‌ విజృంభణ కారణంగా కాకినాడ లో ప్రత్యేకంగా క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మించా ల్సి ఉందని కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ మేరకు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచ నాలు వేసి ప్రతిపాదనలు పంపారు. ఆస్ప త్రి నిర్మాణానికి స్థలం జీజీహెచ్‌కు సమీ పంలో ఉందని నివేదికలో వివరించారు. కాకినాడ జీజీహెచ్‌ అంకాలజీ విభాగంలో నిపుణులైన క్యాన్సర్‌ వైద్యులు ఉన్నారన్నా రు. నిధులు విడుదల చేయాలని కోరారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేస్తారు. అనుమానితులు వెళ్లి పరీక్షలు చేయించుకునే అవకాశం ఉం ది. ఈ కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉంటా రు. పరీక్షించి వెంటనే ఫలితం చెబుతారు.

ఉమ్మడి జిల్లాలో అనుమానితులు.. 21వేలు

ఫ గత మార్చిలో ప్రభుత్వం మూడో దశ ఎన్‌సీడీ సర్వే చేపట్టింది. ఈ సర్వేలోనూ క్యాన్సర్‌ అనుమానిత కేసులు ఉమ్మడి జిల్లాలో ఏకంగా 21 వేలు గుర్తించారు. కాకినాడ జిల్లాలో అయితే 3.0 సర్వేలో ఏకంగా 8,383 అనుమానిత కేసులు గుర్తించారు. ఓరల్‌ క్యాన్సర్‌ విభాగంలో 3,995, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ విభాగంలో 2,337, సర్వైకల్‌ క్యాన్సర్‌ విభాగంలో 2,051 మంది అనుమానితులుగా గుర్తించారు. వీరిని కాకినాడ జీజీ హెచ్‌కు రిఫర్‌ చేశారు. ఇలా ఓరల్‌ క్యాన్సర్‌ పరీక్షలకు పంపిన 56 మందిలో 12 మందికి క్యాన్స ర్‌ నిర్ధారణ అయింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ లక్షణాలు ఉన్న 78 మందిలో ఐదుగురికి క్యాన్సర్‌గా తేలింది. సర్వైకల్‌ క్యాన్సర్‌ లక్ష ణాలు ఉన్న 21 మందిలో నలుగురికి వ్యాధి నిర్ధారణ అయింది.

ఫ తూర్పుగోదావరి జిల్లాలో 6,413 మం దిలో అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఓరల్‌ క్యాన్సర్‌ విభాగంలో 3,186 అనుమానిత కేసులు గుర్తించగా లోతైన వైద్య పరీక్షలకు 44 మందిని రాజమహేంద్రవరం జీజీహెచ్‌ అంకాల జీకి రిఫర్‌ చేశారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ విభా గంలో 1,800 అనుమానిత కేసులుండగా 97 మందిని లోతైన టెస్ట్‌లకు రిఫర్‌ చేశారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ విభాగంలో 1,427 అనుమానితులను గుర్తించగా 24 మందిని జీజీహెచ్‌కు పంపారు. ఈ అనుమానిత కేసుల్లో నలుగురికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌, మరో నలుగురికి ఓరల్‌ క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. మిగిలిన వారికి పరీ క్షలు జరుగుతున్నాయి.

ఫ కోనసీమ జిల్లాలో ఎన్‌సీడీ 2.0 సర్వేలో 4,996 కేసులు గుర్తించగా తాజా సర్వేలో ఐదు వేలకుపైగా అనుమానితులను గుర్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనుమానిత కేసులు, నిర్ధారణ అవుతున్న కేసులు అంతకంతకూ పెరు గుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికా రు లు వివరించారు. బాధితుల్లో ఎక్కువగా 40 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న వారు అధికంగా ఉంటున్నారని తేలింది.

అసెంబ్లీ వేదికగా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. సుమారు ఆ ఒక్క గ్రామంలో 40 మంది క్యాన్సర్‌ బాధితులను గుర్తించి ఆసుపత్రులకు తరలించారు. ఆ గ్రామంలో కేసులు వేలల్లో ఉంటాయని వాదన.

Updated Date - May 07 , 2025 | 12:23 AM