Share News

జవాన్లకు మద్దతుగా నిలవాలి

ABN , Publish Date - May 10 , 2025 | 12:29 AM

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్మిన వేళ పోరాటం చేస్తున్న సైనికులకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భా రత సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ శుక్రవారం అనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు.

జవాన్లకు మద్దతుగా నిలవాలి
అనపర్తిలో నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి, పిక్కి నాగేంద్ర

  • ఎమ్మెల్యే నల్లమిల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర

  • అనపర్తిలో సంఘీభావ ర్యాలీ

అనపర్తి, మే 9 (ఆంధ్రజ్యోతి): భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్మిన వేళ పోరాటం చేస్తున్న సైనికులకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భా రత సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ శుక్రవారం అనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా దేవీచౌక్‌ నుంచి గాంధీబొమ్మ వరకు రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ చేశారు. అనంతరం గాంధిబొమ్మ వద్ద జరిగిన సభలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్‌ మురళీనాయక్‌కు ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై మన సైనికులు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం కావడం మన సైనికుల అంకిత భావానికి నిదర్శనమన్నారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మన కోసం పోరాటం చేస్తున్న సైనికుల కుటుంబాలకు బాసటగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.రామకృష్ణారెడ్డి, ఏరి యా ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ తాడి రామగుర్రెడ్డి, సీఐ సుమంత్‌ పాల్గొన్నారు.

  • మురళీనాయక్‌ త్యాగాన్ని దేశం మరువదు: ఎంపీ

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌లో వీరమరణం పొందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్‌ కుటుంబానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయక్‌ తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ మురళీనాయక్‌ త్యాగా న్ని దేశం మరవదని, సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడి ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నాయక్‌ ఇంటికి సత్యసాయి జిల్లా బీజేపీ నాయకులను పంపించి ధైర్యం చెప్పడం జరిగిందని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:29 AM