ఆటో డ్రైవర్ల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:04 AM
ఆటోడ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతీ ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.15వేల వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. జిల్లాలో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, మోటారు క్యాబ్ డ్రైవర్లకు సుమారు జిల్లావ్యాప్తంగా 7709 మందికి రూ.11.56 కోట్లను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఆటో కార్మికులకు పంపిణీ చేశారు.
‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్కుమార్
కోనసీమ జిల్లావ్యాప్తంగా 7,709 మందికి రూ.11.56 కోట్లు
నగదు పంపిణీని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే ఆనందరావు
ర్యాలీగా తరలివచ్చిన ఆటో కార్మికులు. జిల్లా అంతటా సందడే సందడి
అమలాపురం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటోడ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతీ ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.15వేల వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. జిల్లాలో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, మోటారు క్యాబ్ డ్రైవర్లకు సుమారు జిల్లావ్యాప్తంగా 7709 మందికి రూ.11.56 కోట్లను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఆటో కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమలాపురంలోని భట్నవిల్లి వద్ద జరిగిన ఆటో కార్మికుల సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ. 15వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని డీబీటీ విధానంలో పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. అమలాపురం డివిజన్లోనే 13,600 మందికి ఈ లబ్ధిని అందించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అవిశ్రాంత కృషి అభినందనీయమన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం కూటమి ప్రభుత్వం అందిస్తున్న గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు. ఒక పక్క సంక్షేమాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు అమలాపురంలో రెండు వంతెనలు నిర్మించి భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటో కార్మికుల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని వారికి అన్నివిధాలా సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా అన్ని రంగాల్లోను అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందన్నారు. ఈ సభలో జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి, జిల్లా రవాణాఽశాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మెట్ల రమణబాబు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయవెంకటలక్ష్మి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మహిళానేత పెచ్చెట్టి విజయలక్ష్మి, ఆటో యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బులు, నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన కీలక నేతలతో సహా వివిధ మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.కోటి 96 లక్షల చెక్కును నియోజకవర్గ ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు. అంతకుముందు పేరూరు వై.జంక్షన్ నుంచి ఆటో కార్మికులు భారీగా ర్యాలీ నిర్వహిస్తూ భట్నవిల్లి సెంటర్కు చేరుకున్నారు. చంద్రబాబు అందిస్తున్న సహకారానికి ఆటో కార్మికులతోపాటు నా యకులంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గస్థాయిలో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.