విద్యార్థులందరికీ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేయాలి
ABN , Publish Date - May 22 , 2025 | 01:04 AM
ముమ్మిడివరం బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్ను సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జి.మమ్మీ బుధవారం పరిశీలించారు.
ముమ్మిడివరం, మే 21 (ఆంధ్రజ్యోతి): ముమ్మిడివరం బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్ను సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జి.మమ్మీ బుధవారం పరిశీలించారు. 2025-26 విద్యా సంవత్సరానికి రావాల్సిన స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సరఫరా అయిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను స్టోర్ రూమ్లో జాగ్రత్తగా భద్రపరచాలని, బెల్టులను స్కూళ్ల వారీగా 2025 మార్చి 5వ తేదీ నాటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అందించాలన్నారు. స్కూళ్లు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి నమోదు ప్రక్రియను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో 6 నుంచి 18సంవత్సరాల ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల వివరాలు సేకరించి వారు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదయ్యేలా చూడాలని సూచించారు. పీఎంఎస్హెచ్ఆర్ఐ పథకంలో భాగంగా ఏఏ కాంపోనెంట్స్ ఎన్ని గదులు వచ్చాయి. ఏవిధంగా ఖర్చు చేశారు. ప్రస్తుతం ఏయే పనులు జరుగుతున్నాయో తెలుసుకున్నారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి బీవీవీ సుబ్రహ్మణ్యం, జీసీడీవో ఎంఏకే భీమారావు, ఎంఈవో రాయుడు ఉదయభాస్కరరావు, డేటాఎంట్రీ ఆపరేటర్, భవిత సెంటర్ఉపాధ్యాయుడు, పీటీఐలు, ఎంఐ ఎస్ కో-ఆర్డినేటర్, పీఆర్ఎంటీలు పాల్గొన్నారు.