జిల్లాకు 50 ఎలక్ట్రిక్ బస్సులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:32 AM
పీఎం ఈ-బస్ సేవా కింద కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించనున్న 750ఎలక్ర్టిక్ బస్సుల్లో జిల్లా ఆర్టీసీకి 50 బస్సులు రానున్నాయని తెలుస్తోంది.

రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పీఎం ఈ-బస్ సేవా కింద కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించనున్న 750ఎలక్ర్టిక్ బస్సుల్లో జిల్లా ఆర్టీసీకి 50 బస్సులు రానున్నాయని తెలుస్తోంది. ఈమేరకు దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ఆర్టీసీ జిల్లా అధికారులకు అందినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండరు దశలో ఉంది. ఎలక్ర్టిక్ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచుకోవడం, సాంకేతికతలను సమకూర్చుకోవాల్సి ఉన్నందున ఎలక్ర్టిక్ బస్సులు రోడ్డు ఎక్కేందుకు మరో పది నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. తొలిదశలో భాగంగా జిల్లాకు కేటాయించే 50 ఎలక్ర్టిక్ బస్సులను రాజమహేంద్రవరం డిపో నుంచే ఆపరేట్ చేస్తారు. వీటిని ప్రధాన రూట్లలో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ మార్గాల్లో నడపాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అంచనాకు వచ్చారు. వాతావరణంలో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ-బస్ సేవా ప్రోగ్రాంను అమలు చేస్తున్న నేపథ్యంలో దశలవారీగా ఇతర డిపోల్లోనూ ఎలక్ర్టిక్ బస్సులను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.