Degree Admissions: ఇకపై ఆఫ్లైన్లోనే డిగ్రీ అడ్మిషన్లు
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:49 AM
ఇకపై డిగ్రీ అడ్మిషన్లను పూర్తిగా ఆఫ్లైన్ విధానంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానానికి అంగీకారం తెలిపింది.
కాలేజీలకు ఐదేళ్ల అఫిలియేషన్లకు ఒకే
అమరావతి: ఇకపై డిగ్రీ అడ్మిషన్లను పూర్తిగా ఆఫ్లైన్ విధానంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానానికి అంగీకారం తెలిపింది. పలు డిమాండ్లపై డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఎమ్మెల్సీలు, ఉన్నత విద్యాశాఖ బుధ, గురువారాల్లో నిర్వహించిన చర్చల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్సీలు వి.చిరంజీవి, రామ్గోపాల్రెడ్డి, ఆలపాటి రాజా, కె.శ్రీకాంత్.. డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ కార్యాలయంలో చర్చలు జరిపారు. కార్యదర్శి కోన శశిధర్ కూడా పాల్గొన్నారు.
సొసైటీ పేరు మీద లేదా, సొసైటీలోని ఒక సభ్యుని పేరుపై సొంత భవనాలు కలిగి ఉంటే ఐదేళ్ల పాటు అఫిలియేషన్లు జారీచేసేందుకూ అనుమతిచ్చారు. ఒకవేళ సొసైటీ పేరు మీద భవనం లేకపోతే 30ఏళ్ల లీజు అగ్రిమెంట్ ఉండాలి. యాజమాన్యాల వినతి మేకు డిగ్రీ కోర్సులకు కనీస ఫీజు నిర్ణయించాలని, సెప్టెంబరు నుంచి కొత్త ఫీజుల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. డిగ్రీలో మేనేజ్మెంట్ కోటా రద్దుపై మాత్రం సానుకూలత రాలేదు. ఇకపై ప్రతినెలా విడతల వారీగా పెండింగ్ ఫీజులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. డిమాండ్లలో 80శాతం పరిష్కరించినందున ఆందోళనలను విరమించుకుంటున్నట్లు డిగ్రీ కాలేజీల సంఘం ప్రతినిధులు రమణాజీ, విజయ్భాస్కర్రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News