కుక్కల సంచారంతో ప్రమాదాలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:24 PM
ప్రధాన రహదారిలో గుంపులు గుంపులుగా వీధికుక్కలు సంచరిస్తుండడంతో ద్విచక్రవాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గాండ్లపెంట, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రధాన రహదారిలో గుంపులు గుంపులుగా వీధికుక్కలు సంచరిస్తుండడంతో ద్విచక్రవాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని కదిరి, రాయచోటి ప్రధాన రహదారిలో, వీధుల్లో, పలు గ్రామాల్లో వీధి కుక్కలు అధికమయ్యాయి. నిత్యం రద్దీగా ఉన్న ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనదారులకు ఒక్కసారిగా అవి అడ్డు వస్తుండటంతో పలువురు ప్రమాదాలకు గురై కాళ్లు చేతులు విరిగిన సంఘటన లున్నాయి. అలాగే పలువురు చిన్నారులపై కుక్కలు దాడులు అధికమయ్యాయి. గాండ్లపెంటలో గత యేడాది కుక్కలను రూ.1.50 లక్షల దాకా ఖర్చు చేసి.. వాటిని పట్టుకుని దూరంగా వదలకుండా దగ్గరలో వదలడంతో తిరిగి మండలానికి చేరాయి. కుక్కల సంతానం వృద్ధి చెందడంతో ఏ వీధిలో చూసినా రాత్రిలో సంచరించాలంటే భయాందోళ చెందుతున్నారు. ఏప్పుడు ఎక్కడ నుంచి వచ్చి కరుస్తాయో అని భయపడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.