Share News

Nara Lokesh: ఏపీకి డీ2ఎమ్ టెక్నాలజీ ఫీచర్ ఫోన్.. మంత్రి లోకేశ్‌తో కుష్ టెక్ సీఈవో ఎరిక్ షిన్ భేటీ!

ABN , Publish Date - Jul 10 , 2025 | 02:08 PM

కుష్ టెక్ కంపెనీ సీఈవో ఎరిక్ షిన్‌తో మంత్రి లోకేశ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంలో ఏపీలో డీ2ఎమ్ టెక్నాలజీతో పనిచేసే ఫీచర్ ఫోన్లు, ట్యాబ్‌ల తయారీ యూనిట్‌ను పెట్టాలని సంస్థ సీఈఓను లోకేశ్ ఆహ్వానించారు.

Nara Lokesh: ఏపీకి డీ2ఎమ్ టెక్నాలజీ ఫీచర్ ఫోన్.. మంత్రి లోకేశ్‌తో కుష్ టెక్ సీఈవో ఎరిక్ షిన్ భేటీ!
Nara Lokesh

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన సరికొత్త టెక్నాలజీ ‘డీ2ఎమ్’ ను ఏపీకి తెచ్చేందుకు మంత్రి లోకేశ్ సిద్ధమవుతున్నారు. డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎమ్) టెక్నాలజీ పితామహుడు, కొరియాకు చెందిన కుష్ టెక్ కంపెనీ సీఈవో ఎరిక్ షిన్‌తో లోకేశ్ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఏపీలో ఆ కంపెనీ పెట్టి డీ2ఎమ్ టెక్నాలజీతో పనిచేసే ఫీచర్ ఫోన్లు, ట్యాబ్‌ల తయారీ యూనిట్ ను ఏపీలో పెట్టాలని లోకేశ్ ఆహ్వానించారు. మారుమూల పల్లెలు, గిరిజన, అటవీ, కొండ ప్రాంతాలలో సేవలందించాలని ఎరిక్ షిన్‌ను లోకోశ్ కోరారు.

సింగిల్ విండో విధానంలో కంపెనీకి కావాల్సిన స్థలం, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయసహకారాలను అందిస్తుందని లోకేశ్ తెలిపారు. డీ2ఎమ్ టెక్నాలజీ సాయంతో రాబోతోన్న ఫీచర్ ఫోన్లు, ట్యాబ్‌ల తయారీ యూనిట్‌ను ఏపీలో పెట్టాలని లోకేశ్ కోరారు. డీ2ఎమ్ టెక్నాలజీని భారత్‌లోకి తెచ్చేందుకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సైతం తాను మాట్లాడతానని చెప్పారు.


అసలేంటీ డీ2ఎమ్ టెక్నాలజీ?

ఇంటర్నెట్, వైఫై, సిమ్ కార్డ్ సాయం లేకుండానే ప్రజలకు లైవ్ టీవీ, ఇంటర్నెట్, కాల్స్ అందించే సరికొత్త టెక్నాలజీ ఈ డీ2ఎమ్. ముఖ్యంగా గిరిజన, అటవీ, కొండ ప్రాంతాలతో మారుమూల పల్లెల్లో నివసించే ప్రజలకు ఈ టెక్నాలజీ ద్వారా తయారైన ఫోన్, ట్యాబ్ ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల మొబైల్ డేటా, ఇంటర్నెట్, వైఫై కనెక్షన్ ఖర్చు భరించలేని ప్రజలకు ఈ ఫీచర్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు, ఫోన్ కాల్స్ సేవలు అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. సిగ్నల్ తక్కువగా ఉండే ప్రాంతాలలో సైతం ఈ టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.

ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో, పౌర సేవలను ఇంటివద్దకే మరింత సులభంగా తేవడంలో డీ2ఎమ్ టెక్నాలజీ ఫీచర్ ఫోన్ ఉపకరిస్తుంది. ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ లేని సమయంలో కూడా డీ2ఎమ్ ఫీచర్ ఫోన్ల ద్వారా వాతావరణం, వరదలు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వంటి వాటికి సంబంధించిన హెచ్చరికలు, విపత్తు హెచ్చరికలు వంటి వాటిని డీ2ఎమ్ టెక్నాలజీ ఫోన్ ద్వారా ప్రజలకు చేరవేయవచ్చు.

మారుమూల, గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, రైతులకు వాతావరణానికి సంబంధించిన విషయాలను నేరుగా వారికి చేరవేయడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీకి ప్రసార్ భారతి, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ సహాయసహకారాలున్నాయి. డీ2ఎమ్ ఫీచర్ ఫోన్ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన కుష్ టెక్ కొరియా కో లిమిటెడ్ ఏపీలో ఆ ఫోన్ల, ట్యాబ్ ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది.


లోకేశ్‌తో ఎరిక్ షిన్ బృందం జంగ్ హూన్ కిమ్, సారిన్ సువర్ణ, శశి దొప్పలపూడి, సాగర్ దొడ్డపనేని భేటీ అయ్యారు. ఈ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఫీచర్ ఫోన్, ట్యాబ్ నమూనాను లోకేశ్‌కు చూపించారు. డీ2ఎమ్ టెక్నాలజీ ఫీచర్ ఫోన్, ట్యాబ్‌ను చూసిన లోకేశ్.. ఎరిక్ షిన్, ఆయన బృందాన్ని అభినందించారు. ఈ ఫోన్, ట్యాబ్ అందుబాటులోకి వస్తే పేదల జీవితాలు మారిపోతాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్.. ఇది నా బాధ్యత: సీఎం చంద్రబాబు

స్కూళ్లలో నో పాలిటిక్స్.. అంతా బయటే: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2025 | 11:53 PM