CPI Ramakrishna Urges Police: పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:49 AM
పోలీసు వ్యవస్థ చట్టప్రకారం పనిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలో బుధవారం ..
సీపీఐ రామకృష్ణ
అనంతపురం విద్య, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పోలీసు వ్యవస్థ చట్టప్రకారం పనిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ఆరుగురు పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారని, కొందరు కేసులలో ఇరుక్కుని జైలుకు వెళ్లారని, అధికారంలో ఉన్నవారికి ఊడిగం చేయడం వల్లనే వారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ‘మేము మళ్లీ అధికారంలోకి వస్తాం. అందరికీ వడ్డీతో చెల్లిస్తాం’ అని జగన్ అప్పుడే బెదిరిస్తున్నారని విమర్శించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల తీరుపై ఆయన మాట్లాడుతూ.... జగన్ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక ఎన్నికల్లో ఎవరూ పోటీ ఉండకూడదని అనేక అరాచకాలు సృష్టించారని పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ కూటమి సర్కారు పులివెందుల ఎన్నికలలో అదే పంథాను కొనసాగించిందని ఆరోపించారు. కాగా, ఇంటర్ ఇతర రాష్ట్రాల్లో చదివితే నాన్ లోకల్ కింద పరిగణించడం అన్యాయమని, ఈ అంశంపై ఈ నెల 17న మంత్రి లోకేశ్ను మరోసారి కలుస్తామని తెలిపారు.