Chandrababu Naidu: నియోజకవర్గానికో స్పెషాలిటీ ఆస్పత్రి
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:11 AM
గుంటూరు కాకాని రోడ్డులోని మంగళదా్సనగర్ వద్ద ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆస్పత్రిని బుధవారం ఆయన ప్రారంభించారు. ‘‘ఎక్కడ ఉన్నా ఒక్క గంటలో ఆస్పత్రికి చేరేలా వైద్య సేవలను విస్తరిస్తాం. దీనికోసం ప్రభుత్వ భాగస్వామ్యం ఒక్కటే సరిపోదు.

300 పడకలతో ఏర్పాటుకు కృషి చేస్తా
ఎక్కడ ఉన్నా గంటలోనే ఆస్పత్రికి..
ఆ స్థాయిలో వైద్యసేవల విస్తరణ
సంపూర్ణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉగాది నుంచి పీ-4 విధానం అమలు
త్వరలో ‘మన మిత్ర’లో ప్రైవేటు సేవలూ
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
గుంటూరు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, 300 పడకలతో మెరుగైన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు కాకాని రోడ్డులోని మంగళదా్సనగర్ వద్ద ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆస్పత్రిని బుధవారం ఆయన ప్రారంభించారు. ‘‘ఎక్కడ ఉన్నా ఒక్క గంటలో ఆస్పత్రికి చేరేలా వైద్య సేవలను విస్తరిస్తాం. దీనికోసం ప్రభుత్వ భాగస్వామ్యం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం అవసరం (పీ-4). ఈ ఉగాది నుంచి వారందరి భాగస్వామ్యంతో సంపూర్ణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ- 4 విధానాన్ని ప్రారంభిస్తున్నాం. లాభాలే కాదు.. సమాజం కోసం కూడా బతకాలి అనేలా అడుగులు వేస్తాం.’’ అని సీఎం వెల్లడించారు. ప్రాధామ్యాలు తెలియని వ్యక్తులు పాలన చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మంగళగిరి ఎయిమ్స్ మంచి ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. ‘‘విభజన చట్టం ద్వారా మనకు ఎయిమ్స్ ఇస్తే, దాన్ని మంగళగిరిలో పెట్టాను.
అందుకోసం రూ.300 కోట్లు విలువ చేసే 183 ఎకరాల భూములు ఇచ్చాను. కేంద్రం కూడా రూ.1,618 కోట్లు ఖర్చు చేసి 960 పడకలతో ఆస్పత్రిని నిర్మించింది. అక్కడ ఓపీ పది రూపాయలే. దానికి గత ప్రభుత్వం నీరు ఇవ్వలేదు. పక్కనే కృష్ణానది ఉన్నా వారికి నీరు రాలేదు.
దీంతో వారు ప్రతి రోజూ 600 ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ట్యాంకర్ల రాకపోకల తాకిడితో వాళ్లు ఓపీని కూడా ఆపుకోవాల్సి వచ్చింది. అదెలా ఉందంటే లక్ష రూపాయలు పెట్టి మంచి ఆవును కొనుక్కుని పగ్గం కట్టకుండా వదిలేసుకున్నట్లుగా ఉంది.’’ అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అలాంటి దాన్ని ప్రభుత్వమని అంటారా అని నిలదీశారు. నాడు ఐటీ ప్రపంచం.. నేడు ఏఐ యుగం అని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యరంగంలో సేకరించిన సమాచార సంపదను ఏఐ ద్వారా మదింపు చేస్తే కొత్త వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆపరేషన్లు కూడా ఏఐ గైడ్ చేసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలతోపాటు, వైద్యం వంటి ఇతర అత్యవసర ప్రైవేటు సేవలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. స్వర్ణాంధ్ర- 2047ను వికసిత భారత్- 2047తో అనుసంధానం చేసి రాష్ట్రాన్ని దేశంలో ముందుండేలా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైద్య ఖర్చులు తగ్గించేలా మేధావులు ఆలోచనలు చేయాలని, అవసరం లేకున్నా బెడ్లు నింపుకుని బాధితులపై భారం వేయకుండా ఆన్లైన్ ద్వారా వైద్యం అందించేలా చూడాలని సూచించారు. తప్పని స్థితి వస్తేనే ఆస్పత్రిలో వైద్యం అందించే విధానం వస్తేనే ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. కాగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.....గత ప్రభుత్వం పెట్టిన రూ.6,500 కోట్ల వైద్య బకాయిలను ఒకవైపు తీర్చుతూ, మరోవైపు ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, కందుల లక్ష్మీ దుర్గేశ్, కిమ్స్ ఎండీ బొల్లినేని భాస్కరరావు, లోక్సభ టీడీపీ ఫ్లోర్లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News