Chandrababu Naidu: నకిలీ విత్తనాలపై కఠినంగా ఉండండి
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:28 AM
మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో వ్యవసాయ శాఖ ఎక్స్అఫీషియో స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ తన శాఖలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

మత్స్యకారులకు ఆర్థిక సాయం
అన్నదాత సుఖీభవ అమలుకు చర్యలు
కోళ్ల రైతులు నష్టపోకుండా చూడండి: సీఎం
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రైతులకు తీవ్ర నష్టం చేస్తున్న నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో వ్యవసాయ శాఖ ఎక్స్అఫీషియో స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ తన శాఖలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు కేశవ్, మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ విత్తనాల సమస్య జఠిలంగా మారిందని, గత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నకిలీల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.
దీనిపై సీఎం స్పందిస్తూ, షాపుల్లో విత్తనాలను విక్రయించేటప్పుడే నకిలీలను గుర్తించి, వారి లైసెన్సు రద్దు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న మైక్రో ఇరిగేషన్ బిల్లులు రూ.52కోట్లు విడుదల చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరగా, కేంద్రం మ్యాచింగ్ గ్రాంటు ఉన్న నిధుల్ని వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్లో మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు, రైతులకు అన్నదాత సుఖీభవ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోళ్ల మృతిపై సీఎం ఆరా తీశారు. కోళ్ల రైతులకు నష్టంలేకుండా చూడాలని ఆదేశించారు.
Also Read: ఇకపై సహించను.. ఆ మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..