JEE Main : సాయిమనోజ్ఞ రాష్ర్టానికే గర్వకారణం
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:41 AM
జేఈఈ మెయిన్ ఆలిండియా టాపర్గా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుత్తికొండ సాయి మనోజ్ఞ రాష్ర్టానికే గర్వకారణమని ముఖ్యమంత్రి చందబ్రాబునాయుడు తెలిపారు. గురువారం అమరావతి క్యాంప్

జేఈఈ టాపర్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందన
అమరావతి/గుంటూరు(విద్య), ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్ ఆలిండియా టాపర్గా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుత్తికొండ సాయి మనోజ్ఞ రాష్ర్టానికే గర్వకారణమని ముఖ్యమంత్రి చందబ్రాబునాయుడు తెలిపారు. గురువారం అమరావతి క్యాంప్ కార్యాలయంలో సాయి మనోజ్ఞను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యువ త ప్రతిభావంతులని, వారి సామర్థ్యాలను వెలికితీసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి నిలిపి దానికి అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ప్రతి విద్యార్థీ తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి గొప్ప విజయాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. సాయి మనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థినిగా రాష్ర్టానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ సాయి మనోజ్ఞను అభినందిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కఠోర శ్రమ ఒక్కటే మార్గమని సూచించారు. ఎటువంటి అవసరమైనా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి బిడ్డ విజయంలో తల్లి పాత్ర ఎంతో కీలకమని సాయి మనోజ్ఞ తల్లి పద్మజను లోకేశ్ సత్కరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సాయిమనోజ్ఞ తండ్రి కిశోర్ చౌదరితో కరిక్యులం ప్రక్షాళనపై లోకేశ్ చర్చించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు పాల్గొన్నారు.