Share News

CM Chandrababu Naidu: పీ4లో నేను సైతం

ABN , Publish Date - Jul 26 , 2025 | 03:30 AM

రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పీ4 కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

CM Chandrababu Naidu: పీ4లో నేను సైతం

  • కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా

  • అందరిలో చైతన్యం నింపి ఉద్యమంలా సాగిద్దాం

  • ప్రవాసాంధ్రులను భాగం చేద్దాం: చంద్రబాబు

  • ఆగస్టు 10 లోగా ప్రాధాన్యతల సర్వే

  • మార్గదర్శులుగా 57,503 మంది నమోదు

  • మూడు విధానాల్లో జీరో పావర్టీ అమలు

  • పీ4 సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పీ4 కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. ఈ మేరకు ‘ఐ యామ్‌ మార్గదర్శి’ బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై సమీక్ష నిర్వహించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులూ భాగస్వాములవుతారని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అందరిలోనూ చైతన్యం నింపేందుకు, మరింత మంది సంపన్నులు మార్గదర్శులుగా ముందుకు వచ్చేందుకు తన నిర్ణయందోహదపడుతుందని సీఎం అన్నారు. పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని, పేద కుటుంబాల సాధికరతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని సీఎం నిర్దేశించారు. ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేసేందుకు ఏపీ ఎన్‌ఆర్‌టీ సాయం తీసుకోవాలని చెప్పారు. అలాగే కార్పొరేట్‌ సంస్థలు దీనికి కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు. ఒకవేళ స్థానికంగా మార్గదర్శులు లేకపోతే అప్పుడు స్థానికేతరులను అనుసంధానం చేయాలని తెలిపారు. పీ4లో భాగస్వాములయ్యేందుకు రాష్ట్ర స్థాయిలో దాతలు ముందుకొస్తే, వారిచ్చే నిధుల కోసం కామన్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించవచ్చని పేర్కొన్నారు. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ‘మార్గదర్శులు అందించే ఆర్థిక, ఆర్థికేతర సాయంపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలు సక్రమంగా నమోదు చేసినప్పుడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది’ అని సూచించారు.


15 లక్షల బంగారు కుటుంబాల దత్తతే లక్ష్యం

ఆగస్టు 15 న ఉంచి పీ4 మొదటి విడత ప్రారంభమవుతుందన్నారు. ఆ రోజుకు 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని.. మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరముందని అధికారులు సీఎంకు వివరించారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని... విశాఖపట్నం జిల్లా ఈ విషయంలో చివరన ఉందని వెల్లడించారు. సోషల్‌ మీడియా, ఇతర మద్యమాల ద్వారా పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్‌ ప్రమోషన్‌ కార్యకలాపాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


పీ4 భాగస్వాములు మరింత కీలకంగా ఉండాలి

మూడు విధానాల్లో జీరో పావర్టీ పీ4 అమలు జరుగుతోంది. బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకోవడం, వారికి ఆర్థికేతర సాయాన్ని అందించడం మొదటి విధానం. దీనికి కాలపరిమితి అంటూ ఏమీ ఉండదు. రెండో విధానంలో ఫండ్‌ ఏ నీడ్‌. దీని కింద ఎవరికైతే ఆర్థిక అవసరాలు ఉంటాయో వారికి నగదు సాయం అందించేలా కార్యాచరణ రూపొందించారు. దీనికి కాలపరిమితి ఉంటుంది. మూడో విధానంలో గ్రామాలను, మండలాలను దత్తత తీసుకోవడం.. ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో కమ్యూనిటీ అవసరాలు తీర్చడం, అక్కడ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేలా చూడడం ఉంటాయి. కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యతని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఈ మూడో విధానం అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు పీ4కి భాగస్వాములుగా వ్యవహరిస్తున్న కేపీఎంజీ, మిలాప్‌, తమ్మడ, భవ్య, భార్గో, ప్రాజెక్ట్‌ డీప్‌ సంస్థలు మరింత కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక బంగారు కుటుంబానికి అవసరమైతే ఒకరికి మించి మార్గదర్శులు సాయం అందించేలా చూడాలన్నారు.


నేటి బంగారు కుటుంబాలే రేపటి మార్గదర్శులు

సమాజంలో పేద ధనికుల మధ్య అంతరాలు తగ్గించే పీ4 వంటి కార్యక్రమాన్ని ఎక్కడా చేపట్టలేదని సీఎం అన్నారు. గతంలో జన్మభూమి స్పూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసినట్లే... ఇప్పుడు పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం సచివాలయం నుంచి పీ4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐయామ్‌ మార్గదర్శి పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఇవాల్టి బంగారు కుటుంబాలు రేపటి మార్గదర్శులుగా ఎదగాలన్నదే తన ఆలోచన అని చంద్రబాబు అన్నారు. బంగారు కుటుంబాల అభివృద్ధికి ఏం చేస్తున్నామనే విషయాన్ని వివరించేందుకు ప్రతి ఫ్యామిలీకీ ఓ విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేస్తున్నామని చెప్పారు. స్వల, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా వారి అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు. సీఎం స్పూర్తితో తాను కూడా ఐదు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌ ప్రకటించారు. షాజహాన్‌ను సీఎం అభినందించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ తరహా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తామని ప్రజాప్రతినిధులు సీఎంకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ విజయానంద్‌, స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ కుటుంబరావు, ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 06:55 AM