మొక్కల పెంపకంతో ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు
ABN , Publish Date - May 18 , 2025 | 01:41 AM
కలెక్టర్ సుమిత్కుమార్
చిత్తూరు అర్బన్, మే 17 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్ సుమిత్కుమార్ చెప్పారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్లో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ, మున్సిపల్ పరిధిలోని కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. మొక్కల పెంపకంతో మానసిక, శారీరక ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చన్నారు. వాతావరణంలో వచ్చే మార్పులను, సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ తగ్గించి క్యాన్సర్ వంటి వ్యాధులను అడ్డుకోవచ్చన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిశుభ్రతను పాటిస్తూ.. మొక్కలను నాటి వారి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.