యోగా నిత్యకృత్యం కావాలి
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:55 AM
నిత్య జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఎస్వీయూ తారకరామా స్టేడియంలో చేపట్టిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో యోగాంధ్రకు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ వెంకటేశ్వర్
జిల్లాలో యోగాంధ్ర విజయవంతం
ఎస్వీయూ స్టేడియంలో పదివేల మందికిపైగా హాజరు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్ 21 (ఆంధ్రజ్యోతి): నిత్య జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఎస్వీయూ తారకరామా స్టేడియంలో చేపట్టిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో యోగాంధ్రకు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. భారతీయ సంస్కృతిలో యోగాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు దినచర్యలో యోగా భాగం కావాలని కోరారు. యోగాను పాఠ్యాంశాల్లో చేరాల్సి ఉందన్నారు. విద్యార్థులు స్నేహ పూర్వకంగా మెలగాలని, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. అంతకు ముందు స్టేడియంలో మొక్కలు నాటారు. యోగాను ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మంచి పరిణామమని ఎస్పీ హర్షవర్ధన్రాజు అన్నారు. యోగా ద్వారా మనుషుల్లో సానుకూల, ఆరోగ్యకర దృక్పథం అలవడుతుందన్నారు. యువత సామాజిక రుగ్మతల నుంచి బయటపడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన యోగాను భావితరాలకు అందించాలన్నారు.
విజయవంతంగా యోగాంధ్ర
జిల్లా స్థాయిలో ఎస్వీయూ తారకరామా స్టేడియం వేదికగా చేపట్టిన యోగాంధ్ర పక్కాగా, పకడ్బందీగా విజయవంతమైంది. కలెక్టర్ వేంకటేశ్వర్ నేతృత్వంలో వివిధ శాఖలు, అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్, జనసమీకరణ, సదుపాయాల కల్పన వరకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, అందంగా, యోగాంధ్ర ముగ్గులతో ముస్తాబు చేశారు. యోగా చేసేందుకు వీలుగా గ్రీన్ కార్పెట్లతో పాటు మ్యాట్లను ఉచితంగా అందించారు. పాల్గొన్న వారందరికీ ఉచితంగా టీషర్టులు, తాగునీరు, స్కాక్స్ అందించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక హెల్త్ డెస్క్లు ఏర్పాటు చేశారు. కాలకృత్యాలకు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఆద్యంతమూ ఫొటో షూట్, డ్రోన్లతో చిత్రీకరించారు. నిర్దేశిత సమయానికి విద్యార్థులు, ఉద్యోగులు స్టేడియంకు చేరుకునేలా చూశారు. తద్వారా యోగాంధ్ర విజయవంతంగా ముగిసింది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్ క్రాంతి ఆధ్వర్యంలో యోగాసనాలు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్ క్రాంతి ఆధ్వర్యంలో అందరి చేత యోగాసనాలు వేయించారు. ఇందులో భాగంగా ఒక చిన్నారి యోగాసనాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఏఎస్పీ రవిమనోహరాచారి, ఎస్వీయూ, వేద వర్సిటీ వీసీలు అప్పారావు, రాణిసదాశివమూర్తి, రిజిస్ర్టార్లు భూపతినాయుడు, భాస్కరుడు, డీఆర్వో నరసింహులు, కమిషనర్ మౌర్య, టూరిజం ఆర్డీ రమణప్రసాద్, పద్మావతి వర్సిటీ రిజిస్ట్రార్ రజని, ఎస్వీ, పద్మావతి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు రవి, నాగరాజు, ఎంబీయూ ఎల్వో హరిశ్చంద్రప్రసాద్, నారాయణ సంస్థల డీజీఎం కొండలరావు, చైతన్య ఏజీఎం ప్రసాద్, అగ్రికల్చర్ కాలేజీ ఎన్ఎ్సఎ్స అధికారి మధుసూదనరెడ్డి, ఎస్వీయూ మీడియా డీన్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు, ఎన్ఎ్సఎ్స కో-ఆర్డినేటర్ హరికృష్ణయాదవ్, కల్చరల్ కోఆర్డినేటర్ వివేక్, డీఎస్పీలు రామకృష్ణాచారి, భక్తవత్సలం, చంద్రశేఖర్, రవికుమార్, చెంచుబాబు, శ్రీనివాస్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.