రైతాంగానికి రూ.వందకోట్ల రుణాలిస్తాం
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:40 AM
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా 75 సింగిల్ విండోల ద్వారా స్వల్ప, దీర్ఘ, వ్యవసాయేతర రుణాలుగా రూ.వంద కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డీసీసీ చైర్మన్ అమాస రాజశేఖర్రెడ్డి తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75 సింగిల్ విండోల ద్వారా స్వల్ప, దీర్ఘ, వ్యవసాయేతర రుణాలుగా రూ.వంద కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డీసీసీ చైర్మన్ అమాస రాజశేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలోని మీటింగు హాల్లో సింగిల్ విండోల సీఈవోలతో సమీక్షించారు. సింగిల్ విండోల త్రిసభ్య కమిటీ చైర్మన్ల విజ్ఞప్తితో ఈ మేరకు రుణాలివ్వాలని నిర్ణయించామని చెప్పారు. ప్రస్తుతం 10 సింగిల్విండోల ద్వారా అన్నిరకాల రుణాల రూపేణ రూ.79 లక్షలు అందించడం జరిగిందని వివరించారు. రైతుల ఇబ్బందులను గుర్తిస్తూ ప్రతి సింగిల్ విండో రూ.2కోట్ల మేరకు వివిధరకాల రుణాలు ఇవ్వడానికి ఆదేశాలు జారీచేశారు. కంప్యూటరీకరణ నిర్ణీత వ్యవధికంటే ముందుగానే పూర్తిచేయడంపై సీఈవోలను అభినందించారు. ఈనెలాఖరులోగా అన్ని సింగిల్విండోల్లోనూ ఈ-ఆడిట్ పూర్తిచేయాలని సూచించారు. సీఈవో శంకర్ బాబు మాట్లాడుతూ.. కొత్తరుణాలు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్యాంకు జనరల్ మేనేజర్ మనోహర్ గౌడ్, డీజీఎం వెంకటాచలపతి, లీగల్ అడ్వైజర్ గంగిరెడ్డి, ఏజీఎం సురే్షబాబు తదితరులు పాల్గొన్నారు.