ఆడుదాం ఆంధ్ర ఖర్చులపై విజిలెన్స్ ఆరా
ABN , Publish Date - May 25 , 2025 | 01:12 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఖర్చులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల, మండల , నియోజకవర్గ , జిల్లా ,రాష్ట్రస్థాయుల్లో ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
గంగాధరనెల్లూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఖర్చులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల, మండల , నియోజకవర్గ , జిల్లా ,రాష్ట్రస్థాయుల్లో ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే.అప్పట్లోనే నిధుల దుర్వినియోగమయ్యాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణకు విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.ఈ నేపథ్యంలో తిరుపతి విజిలెన్స్శాఖకు చెందిన అధికారులు ఆడుదాం ఆంధ్ర వివరాలు తెలపమంటూ మండల పరిషత్ అధికారులకు ఆన్లైన్లో ఓ ప్రొఫార్మా పంపారు.మొత్తం ఎన్ని నిధులు విడుదలయ్యాయి, ఏయే క్రీడల్లో పోటీలు నిర్వహించారు, ఎంతమంది క్రీడాకారులు హాజరయ్యారు,విజేతలకు ఏం అందజేశారు, క్రీడాకారులకు ఏమేం కిట్లు పంపిణీచేశారనే విషయాలపై వివరాలు కోరారు.గంగాధరనెల్లూరు ఎంపీడీవో సోమలరాజు సతీష్ నాలుగురోజుల క్రితం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లోకే్షకు ఈ వివరాలను సేకరించి తిరుపతి విజిలెన్స్ అధికారులకు పంపించాలని ఆదేశించారు. దీంతో లోకేష్ విజిలెన్స్ అధికారులు పంపిన ప్రొఫార్మా ప్రకారం వివరాలు అందజేయాలని మండలంలోని 25 సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు మెయిల్స్ పంపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్రకు సంబంధించి బిల్లులు లభించకపోవడంతో అప్పట్లో ఇక్కడ పనిచేసిన అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసి, వాటి నివేదికలు ఎక్కడున్నాయి, ఎవరు పర్యవేక్షించారనే వివరాలు సేకరించే పనిలో మండల పరిషత్ అధికారులున్నారు.