రావణబ్రహ్మ వాహనంపై విఘ్ననాథుడి విహారం
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:14 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రతేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం రావణబ్రహ్మ వాహనంపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడు విహరించాడు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రతేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం రావణబ్రహ్మ వాహనంపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడు విహరించాడు. ఈ కార్యక్రమానికి పుణ్యసముద్రం, లక్ష్మాంబపురం, సంతపల్లె, ద్వారకాపురం, కురప్పల్లె, సిద్ధంపల్లె, ముద్దురామాపురం గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉభయదారులు ఉభయ వరుస తీసుకురావడంతో ఆలయ అలంకార మండపంలో ఉత్సవర్లకు పూజలు చేశాక రావణబ్రహ్మ వాహనంపై అధిష్ఠింపజేసి, కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ఈవో పెంచలకిషోర్, ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, బాలాజీనాయుడు, ఉభయదారులు పాల్గొన్నారు. ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సోమవారం వరసిద్ధుడికి యాళి వాహన సేవ నిర్వహించనున్నారు.