డీసీసీబీకి రెండు విశిష్ట అవార్డులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:23 AM
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (ఆప్కాబ్) 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం విజయవాడలోని గవర్నర్పేట ఎం.బి. విజ్ఞానకేంద్రంలో వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకాగా, ఆప్కాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు అధ్యక్షత వహించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (ఆప్కాబ్) 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం విజయవాడలోని గవర్నర్పేట ఎం.బి. విజ్ఞానకేంద్రంలో వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకాగా, ఆప్కాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాయలసీమలోని సహకార బ్యాంకుల పరిధిలో డిపాజిట్లు, రుణపంపిణీ, వసూళ్ళు, నిర్ణీత గడువుకంటే ముందుగానే సింగిల్ విండోల కంప్యూటరీకరణ వంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని ‘ఓవరాల్ పర్ఫార్మెన్స్’ కింద 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఉత్తమ పనితీరు కనబరచిన చిత్తూరు జిల్లా సహకార బ్యాంకును అవార్డుకు ఆప్కాబ్ ఎంపిక చేసింది.మంత్రి అచ్చెన్నాయుడు చేతులమీదుగా చిత్తూరు డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు చేతులమీదుగా బ్యాంకు సీఈవో సి. శంకర్బాబు సర్టిఫికెట్, మెమెంటోతో పాటు రూ.3లక్షల నగదు బహుమతిని అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలుగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి కోసల నగరం, వాయల్పాడు, ఏర్పేడు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రేణిగుంట, మదనపల్లె, గంగాధరనెల్లూరు సింగిల్ విండోలు అన్నిరంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆప్కాబ్ ఎంపికచేసింది. ఈ సందర్భంగా ఆయా సింగిల్విండోల త్రిసభ్యకమిటీ చైర్మన్లు, సీఈవోలు కార్యక్రమానికి హాజరై మంత్రి నుండి సర్టిఫికెట్, మెమెంటో, రూ.20 వేల చొప్పున పారితోషికాన్ని అందుకున్నారు. ఆప్కాబ్ ఎండీ డాక్టర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి రాజశేఖర్, సహకారశాఖ రిజిస్ట్రార్ అహ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు.