తిరుపతికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:32 AM
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికైంది. 3 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగర కార్పొరేషన్ సూపర్ స్వచ్ఛ లీగ్ను కైవశం చేసుకుంది.
ఈనెల 17న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
తిరుపతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికైంది. 3 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగర కార్పొరేషన్ సూపర్ స్వచ్ఛ లీగ్ను కైవశం చేసుకుంది. ఈ నెల 17న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూపొందించిన స్వచ్ఛ భారత్ విప్లవం కొనసాగుతోంది. ఏటా స్వఛ్చ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ప్రోత్సహిస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడం పట్ల కమిషనర్ ఎన్.మౌర్యతో పాటు పలువురు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది, నగర ప్రజల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు.