ఆ ఏనుగు దంతాలు భాకరాపేటలో చోరీకి గురైనవే
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:14 AM
ఇటీవల హైదరాబాదులో డ్రైవర్ ప్రసాద్ వద్ద దొరికిన ఏనుగు దంతాలు భాకరాపేట అటవీశాఖ కార్యాలయంలో చోరీకి గురైనవేనని జిల్లా అటవీశాఖ అధికారి వివేక్ తెలిపారు.
రెండు గన్నులపై దర్యాప్తు కొనసాగుతోందన్న అటవీశాఖ అధికారి వివేక్
మంగళం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఇటీవల హైదరాబాదులో డ్రైవర్ ప్రసాద్ వద్ద దొరికిన ఏనుగు దంతాలు భాకరాపేట అటవీశాఖ కార్యాలయంలో చోరీకి గురైనవేనని జిల్లా అటవీశాఖ అధికారి వివేక్ తెలిపారు. తిరుపతిలో మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘భాకరాపేట అటవీశాఖ కార్యాలయంలో భద్రపరచిన ఏనుగు దంతాలు 2023లో చోరీకి గురయ్యాయి. ఆ సమయంలో ఏనుగు దంతాల పొడువు, వాటి చుట్టుకొలతలను రికార్డులో నమోదు చేసున్నారు. హైదరాబాదులో ప్రసాద్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాల పొడవు, చుట్టుకొలతతో ఇవి సరిపోయాయి. దీనిని మరింత శాస్త్రీయంగా నిర్ధారించడానికి డెహ్రడూన్లోని ల్యాబ్కు ఏనుగు దంతాల యనామిల్ను పంపించాం. ఏనుగు దంతాలతో పాటు చోరీకి గురైన రెండు గన్నులు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి? ఈ చోరీకి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. సంబంధిత పోలీసు అధికారులను కలిసి వివరాలను సేకరిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుంది. డెహ్రడూన్లోని ల్యాబ్ నుంచి రిపోర్టు రావడానికి నెల రోజులు పట్టే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు. కాగా, ఏనుగు దంతాలను సొమ్ము చేసుకునే ప్రయత్నంలో హైదరాబాద్లో నిందితుడు పట్టుబడటంతో భాకరాపేట అటవీశాఖ కార్యాలయంలో రెండు ఏనుగు దంతాలతో పాటు రెండు గన్నులు కూడా అప్పట్లో చోరీకి గురైన అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయట పెట్టింది. హైదరాబాద్ పోలీసుల వద్దనున్న నిందితుడైన డ్రైవర్ ప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది.