Share News

‘సైనికులకు’ భూకేటాయింపు తప్పేమీ కాదు

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:58 PM

సైనికులకు.. మాజీ సైనికోద్యోగుల కోటా కింద భూకేటాయింపు చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టతనిచ్చింది. కేవలం మాజీ సైనికులకే భూమిని కేటాయించాలనే చట్టనిబంధన ఏదీ లేదని తేల్చిచెప్పింది. సర్వీసులోని సైనికులు, మాజీ సైనికోద్యోగులు కూడా భూకేటాయింపు కోసం జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ 2022లో సర్క్యులర్‌ జారీ చేశారని గుర్తు చేసింది.

‘సైనికులకు’ భూకేటాయింపు తప్పేమీ కాదు

ఆ భూమిని వెనక్కి తీసుకోరాదు

తిరుపతి కలెక్టర్‌ నిర్ణయం సరికాదు

మూడు నెలల్లో నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్న హైకోర్టు

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సైనికులకు.. మాజీ సైనికోద్యోగుల కోటా కింద భూకేటాయింపు చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టతనిచ్చింది. కేవలం మాజీ సైనికులకే భూమిని కేటాయించాలనే చట్టనిబంధన ఏదీ లేదని తేల్చిచెప్పింది. సర్వీసులోని సైనికులు, మాజీ సైనికోద్యోగులు కూడా భూకేటాయింపు కోసం జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ 2022లో సర్క్యులర్‌ జారీ చేశారని గుర్తు చేసింది. సర్వీసులో ఉన్న సమయంలో భూకేటాయింపు చేశారనే కారణంతో భూములను వెనక్కి తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది. సాయుధ దళాల్లో సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు, సరిహద్దులను, ప్రజలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా మాజీ సైనికులకు భూకేటాయింపు విధానాన్ని తీసుకొచ్చారని పేర్కొంది. నిబంధనలు అడ్డుపెట్టుకొని మంచి ఉద్దేశాన్ని దెబ్బతీయడానికి వీల్లేదని తెలిపింది. ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కోటా కింద పిటిషనర్‌కు కేటాయించిన 4.35 ఎకరాలను అడవి భూమని, అడవి పోరంబోకుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్‌ నిషేధిత భూముల జాబితా(22ఏ) నుంచి తొలగించడానికి తిరుపతి కలెక్టర్‌ నిరాకరించడాన్ని తప్పుపట్టింది. ఈ కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి.

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగలి పరిధిలో తిరుపతికి చెందిన చెంచయ్య నాయుడికి మాజీ సైనికోద్యోగుల కోటాలో 4.35 ఎకరాలను 2009లో అధికారులు కేటాయించారు. 2019లో ఆ భూమిని విక్రయించేందుకు ప్రయత్నించగా నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని అధికారులు చెప్పారు. ఆ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌ను కోరగా.. భూమిని అడవి పోరంబోకుగా పేర్కొంటూ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు నిరాకరించారు. అధికారుల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ చెంచయ్యనాయుడు 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి... జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల పై అభ్యంతరం ఉంటే భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ వద్ద అప్పీల్‌ చేసుకోవాలని 2024లో వ్యాజ్యాన్ని పరిష్కరించారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చెంచయ్య నాయుడు 2015లో ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. సైనికోద్యోగి తరపున న్యాయవాది ఎంఆర్‌కె చక్రవర్తి వాదనలు వినిపిస్తూ.... మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూమిని పదేళ్ల తరువాత విక్రయించుకొనేందుకు వెసులుబాటు ఉందన్నారు. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. ఏర్పేడు తహశీల్దార్‌ సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాలు ప్రకారం ఆ భూమిని తక అడవిగా వర్గీకరించారన్నారు. కలెక్టర్‌ మాత్రం భూమిని అడవి పోరంబోకుగా పేర్కొంటూ నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు నిరాకరించారన్నారు. సీసీఎల్‌ఏ సర్క్యులర్‌ ప్రకారం సర్వీసులో ఉన్న సైనికులు సైతం భూముల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. అడవి, అడవి పోరంబోకు పదాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కలెక్టర్‌ యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొంది. తహశీల్దార్‌ ఇచ్చిన నివేదికలో భూమి అడవి పోరంబోకు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేనప్పటికి పిటిషనర్‌ భూమిని అడవి పోరంబోకుగా నిర్ధారిస్తూ జిల్లా కలెక్టర్‌ ఎలా ఉత్తర్వులు ఇచ్చారో అర్ధం కావడం లేదని పేర్కొంది. మూడునెలల్లో భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని తిరుపతి కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ లోపు తొలగించకుంటే భూముల బదిలీ/విక్రయం నిమిత్తం దస్త్రాలను సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద ఉంచవచ్చని పిటిషనర్‌కు తెలిపింది. వాటిని పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ సుభేందు సమంతో ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.

Updated Date - Nov 18 , 2025 | 11:58 PM