ఎన్టీఆర్ వైద్యసేవలకు డోకా లేదు
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:36 AM
ప్రభుత్వం బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్యసేవలను నిలిపివేయాలని హాస్పిటల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం జిల్లాపై పెద్దగా ప్రభావం కనిపించలేదు.
తిరుపతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్యసేవలను నిలిపివేయాలని హాస్పిటల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం జిల్లాపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా 38 నెట్వర్క్ ఆస్పత్రులు ఉంటే కేవలం 4 ఆస్పత్రుల్లో మాత్రమే ఓపీ సేవలు నిలిచాయి. వీటిల్లోనూ అత్యవసర వైద్యసేవలకు ఎక్కడా ఆటంకం జరగలేదని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని సంకల్ప, రష్ ఆస్పత్రులతోపాటు గూడూరులోని సీఆర్ రెడ్డి, మైథిలి ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేశారన్నారు. తొలుత వాసన్ ఐకేఆర్ ఆస్పత్రి కూడా వైద్యసేవలు నిలిపివేసి, శనివారం కొనసాగించిందన్నారు. కాగా అత్యవసర శస్త్రచికిత్సల నిర్వహణలో ఆస్పత్రుల యాజమాన్యాలు అశ్రద్ధ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.