చంద్రప్రభలో అభయప్రదాత
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:30 AM
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో బుధవారం రాత్రి వినాయకస్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం, చినకాంపల్లె, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చిగరపల్లె, తిరువణంపల్లె, బొమ్మసముద్రం, అగరంపల్లె, పుణ్యసముద్రం, ఎగువ,దిగువమారేడుపల్లెలు, సంతపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, కారకాంపల్లె గ్రామాలకు చెందిన హరిజనులు ఉభయదారులుగా వ్యవహరించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో బుధవారం రాత్రి వినాయకస్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం, చినకాంపల్లె, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చిగరపల్లె, తిరువణంపల్లె, బొమ్మసముద్రం, అగరంపల్లె, పుణ్యసముద్రం, ఎగువ,దిగువమారేడుపల్లెలు, సంతపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, కారకాంపల్లె గ్రామాలకు చెందిన హరిజనులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో కాణిపాకంలో కలశ ఊరేగింపును ఘనంగా నిర్వహించాక మూల విగ్రహానికి అభిషేకాన్ని నిర్వహించారు. దేవదాయ శాఖ విశ్రాంత ఏడీసీ జి.కేశవులు కుటుంబ సభ్యులతో కలసి వరసిద్ధునికి బుధవారం పట్టువస్త్రాలను సమర్పించారు. రాత్రి స్వామికి ఉభయ వరస రావడంతో కల్యాణ వేదిక వద్ద స్వామి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధుని ఉత్సవ విగ్రహాలను చంద్రప్రభ వాహనంపై ఉంచి కాణిపాక పురవీధుల్లో భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు.కాగా కాణిపాకంలో బుధవారం ఉదయం సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను స్వర్ణరథంపై ఉంచి మాఢవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఈవో పెంచలకిషోర్, ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు,బాలాజీనాయుడు,ఉభయదారులు పాల్గొన్నారు.గురువారం వరసిద్ధునికి కల్పవృక్ష వాహన సేవను నిర్వహించనున్నారు.