కన్నుల పండువగా శ్రీనివాసుడి పుష్పపల్లకి
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:53 AM
ఆణివార ఆస్థానం సందర్భంగా బుధవారం సాయంత్రం తిరుమలలో చిరుజల్లుల నడుమ పుష్పపల్లకీ సేవ కన్నుపండువగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని కొలువుదీర్చి శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు.
తిరుమల, ఆంధ్రజ్యోతి: ఆణివార ఆస్థానం సందర్భంగా బుధవారం సాయంత్రం తిరుమలలో చిరుజల్లుల నడుమ పుష్పపల్లకీ సేవ కన్నుపండువగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని కొలువుదీర్చి శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. పల్లకీలోని ఉత్సవమూర్తులను భక్తులు దర్శించి ఆనందపరశులయ్యారు. ఆరురకాల సంప్రదాయ పుష్పాలు, మరో ఆరు రకాల స్వదేశీ, విదేశీ కట్ఫ్లవర్స్తో కలిపి మొత్తం టన్ను బరువు కలిగిన పుష్పాలను పల్లకి అలంకరణకు వినియోగించారు. వివిధ దేవతామూర్తుల ప్రతిమలను పల్లకీకి ఏర్పాటు చేశారు. పష్పపల్లకీ సేవకు ముందు వర్షం పడి నిలిచిపోయిన క్రమంలో ఆలయంపై ఏర్పడిన ఇంద్రధనస్సు భక్తులకు కనువిందు చేసింది. ఈఅందాల నడుమ పుష్పపల్లకీ ఉత్సవం శోభాయమానంగా దర్శనమిచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవంలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు.