మానవ జీవన వికాసానికి కళలే మూలాధారం
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:20 AM
మనిషి జీవన వికాసానికి కళలు మూలాధారంగా నిలుస్తాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయభాస్కరరావు పేర్కొన్నారు. మూడు రోజులుగా ఎస్వీ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువతరంగ్ - 2025 కార్యక్రమం శనివారం ముగిసింది.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మనిషి జీవన వికాసానికి కళలు మూలాధారంగా నిలుస్తాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయభాస్కరరావు పేర్కొన్నారు. మూడు రోజులుగా ఎస్వీ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువతరంగ్ - 2025 కార్యక్రమం శనివారం ముగిసింది. సాయంత్రం శ్రీనివాసా ఆడిటోరియంలో నిర్వహించిన సమాపనోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన విజయభాస్కరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడా సాంస్కృతిక అంశాల్లోనూ ప్రతిభను పెంచుకోవాలని కోరారు. కళల్లో మన సంస్కృతి సంప్రదాయాలు నిక్షిప్తమై ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గౌరవ అతిథి ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సంగీతం, నృత్యం, కళల పట్ల ఆసక్తిని పెంపొందించినట్లు అయిందని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ బీవీ మురళీధర్, కల్చరల్ అఫైర్స్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, న్యాయ నిర్ణేతలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చివరి రోజు సందడే సందడే
యువతరంగ్లో భాగంగా మూడవ రోజైన శనివారం శ్రీనివాస ఆడిటోరియం, అన్నమయ్య భవనం, సెనేట్ హాల్లో సాంస్కృతిక పోటీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రత్యేక ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.