త్వరలో ‘శ్రీవారి వైద్యసేవ’
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:36 AM
టీటీడీ ఆస్పత్రుల్లో భక్తులు స్వచ్ఛంద సేవ అందించేలా ‘శ్రీవారి వైద్యసేవ’ను త్వరలోనే ప్రారంభించాలని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ సూచించారు. శ్రీవారి సేవపై శుక్రవారం ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంతో సమీక్షిస్తూ ఈ సూచన చేశారు.
-టీటీడీ ఆసుపత్రుల్లోని రోగులకు శ్రీవారి సేవకుల సేవలు
- ఈవో సింఘాల్
తిరుమల, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆస్పత్రుల్లో భక్తులు స్వచ్ఛంద సేవ అందించేలా ‘శ్రీవారి వైద్యసేవ’ను త్వరలోనే ప్రారంభించాలని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ సూచించారు. శ్రీవారి సేవపై శుక్రవారం ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంతో సమీక్షిస్తూ ఈ సూచన చేశారు. తిరుపతి, తిరుమలలోని ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల, అశ్విని ఆస్పత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం శ్రీవారి వైద్యసేవా సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో నవంబరులో శ్రీవారి సేవకులకు శిక్షణ ఉంటుందని, దీనికి సంబంధించిన ఆడియో, వీడియో విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు.
శ్రీవారి సేవకుల గోసేవ
ఎస్వీ గోసంరక్షణశాలలోనూ శ్రీవారి సేవకులు గోసేవ చేయడానికి వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దేశంలోని టీటీడీ ఆలయాల్లోనూ శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, వైజాగ్, కన్యాకుమారి, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో మొదటివిడతగా శ్రీవారి సేవ ను ప్రారంభించాలన్నారు. అనంతరం మిగతా ఆలయాల్లో దశలవారీగా శ్రీవారిసేవను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీపీఆర్వో రవిని ఆదేశించారు. ఈ సమీక్షలో ఐటీ జీఎం పణికుమార్ నాయుడు, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, అశ్విని సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఐఐఎం ప్రతినిధులు, రాష్ట్ర ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.