అమ్మవారికి వసంతోత్సవాలు
ABN , Publish Date - May 12 , 2025 | 01:44 AM
తిరుచానూరు ఫ్రైడే గార్డెన్లో సుందరంగా తీర్చిదిద్దిన పచ్చని వాతావరణంలో శ్రీవారి పట్టపురాణి అలిమేలు మంగ వసంతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
తిరుచానూరు, మే 11(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు ఫ్రైడే గార్డెన్లో సుందరంగా తీర్చిదిద్దిన పచ్చని వాతావరణంలో శ్రీవారి పట్టపురాణి అలిమేలు మంగ వసంతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఉత్సవమూర్తిని ఫ్రైడే గార్డెన్కు వేంచేపు చేసి బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు భక్తిరసంలో ఓలలాడించాయి. రాత్రి అమ్మవారు తిరుచ్చిపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను సాక్షాత్కరించారు. సోమవారం ఉదయం అమ్మవారికి స్వర్ణ రథోత్సవం జరగనుంది. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, టీటీడీ ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్ ఏఈవో దేవరాజులు, ఆలయ అర్చకులు, సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.