అడవుల్లో సోలార్ రిఫ్లెక్టర్ లైట్లు
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:33 AM
అటవీ సరిహద్దు ప్రాంత ప్రజల రక్షణ నిమిత్తం అడవుల్లో ప్రత్యేక సోలార్ రిఫ్లెక్టర్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ తూర్పు ఎఫ్ఆర్వో థామస్ సుకుమార్ తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఏనుగులు, ఇతర అడవి జంతువుల బారినుంచి అటవీ సరిహద్దు ప్రాంత ప్రజల రక్షణ నిమిత్తం అడవుల్లో ప్రత్యేక సోలార్ రిఫ్లెక్టర్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ తూర్పు ఎఫ్ఆర్వో థామస్ సుకుమార్ తెలిపారు. అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలను జంతువుల బారినుంచి కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా బెంగళూరులో ప్రత్యేకంగా తయారు చేసిన సోలార్ రిఫ్లెక్టర్ లైట్లు పంపిణీ చేసిందన్నారు. ఒక్కో యూనిట్ ధర రూ.12,500 కాగా.. తొలి దశలో పది లైట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. కల్లూరు, దేవళంపేట, కోటపల్లె, జూపల్లె, సైలజగుంట, కమ్మపల్లెను ఏనుగులు, అటవీ జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో తొలుత లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సోలార్ రిఫ్లెక్టర్ లైట్ల నుంచి తేనెతీగల శబ్దంతోపాటు తెల్లటి రంగులో వెలుతురు వస్తుందని, వీటి కిరణాలు కళ్లలో పడటంతో జంతువులు అటువైపుగా రావడానికి వెనకాడతాయన్నారు. అధునాతన సాంకేతిక విధానంలో రూపొందించిన లైట్లలో శబ్దంతోపాటు లైట్స్ ఆఫ్ అండ్ డౌన్, రొటేషన్ పద్ధతిలో వీటిని వాడుకునే సౌలభ్యం ఉందన్నారు.