గంటలో దర్శనం అని చెప్పి ఉచిత క్యూలో పంపారు
ABN , Publish Date - May 17 , 2025 | 01:57 AM
ఒక ట్రావెల్స్ సంస్థ కేవలం గంటలోనే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని చెప్పి తీసుకువచ్చి చివరకు ఉచిత దర్శనం క్యూలో పంపారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది.
తిరుమల, మే16(ఆంధ్రజ్యోతి): ఒక ట్రావెల్స్ సంస్థ కేవలం గంటలోనే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని చెప్పి తీసుకువచ్చి చివరకు ఉచిత దర్శనం క్యూలో పంపారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది. వారు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ అనే సంస్థ బెంగళూరుకు నుంచి తిరుమలకు రానుపోను, టిఫిన్, భోజనం, వసతి వంటి సౌకర్యాల కల్పన కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3,600 తీసుకుంది. బస్సులో 36 మంది భక్తులు శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. వీరికి ఉదయం టిఫిన్ పెట్టించి జీపుల ద్వారా తిరుమలకు తీసుకువచ్చారు. వీరిని కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉచిత క్యూలైన్ దగ్గర వదిలిపెట్టారు. ట్రావెల్స్ ఇచ్చిన టికెట్లను అక్కడ విధుల్లో ఉన్న భద్రతాసిబ్బందికి భక్తులు చూపించగా ఇవి దర్శన టికెట్లు కాదని తేల్చిచెప్పారు. మీరు ఉచిత దర్శనం క్యూలైన్లోకి ప్రవేశిస్తే దాదాపు 10 గంటల తర్వాత దర్శనం అవుతుందని వివరించారు. దీంతో భక్తబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటలోనే దర్శనం చేయిస్తామని ఇలా మోసం చేశారని కొందరు విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేశారు. కేసును తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే ట్రావెల్స్ టికెట్పై ‘ఫ్రీ దర్శనం’ అని మాత్రమే రాసి ఉండటం గమనార్హం. ట్రావెల్స్ ప్రతినిధి భాస్కర్ మాట్లాడుతూ.. తాము ఉచిత దర్శనమనే చెప్పామని, ఎలాంటి ప్రత్యేక దర్శన టికెట్లు ఇస్తామని చెప్పలేదని పేర్కొన్నారు.