మట్టినీ అమ్మేస్తున్న ఇసుక స్మగ్లర్లు
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:21 AM
పలమనేరులో స్మగ్లర్ల ధాటికి కౌండిన్య నదిలో ఉన్న ఇసుక ఖాళీ అయిపోయింది.దీంతో ఇసుక కోసం వీరంతా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
పలమనేరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పలమనేరులో స్మగ్లర్ల ధాటికి కౌండిన్య నదిలో ఉన్న ఇసుక ఖాళీ అయిపోయింది.దీంతో ఇసుక కోసం వీరంతా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.నది సమీపంలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న మట్టిని ఎక్సకవేటర్ల ద్వారా తవ్వి, ట్రాక్టర్లలో నింపి నది గుంతల్లో పడేస్తారు.ఈ మట్టిని ఎక్సకవేటర్తో బాగా ఎత్తిపోసి అందులో నునుపు మట్టి నీటిలో కలిసిపోయేలా చేస్తారు.తరువాత మిగిలిన ఇసుకను పోలిన మట్టిని ఎక్సకవేటర్ సాయంతో ట్రాక్టర్లకు నింపి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు స్మగ్లర్లు ఈ ఇసుకను స్థానికంగా విక్రయిస్తుండగా మరికొందరు అనువైన ప్రాంతానికి తరలించి డంప్ చేసుకొని రాత్రి వేళల్లో పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కోలారుకు, బెంగళూరుకు తరలిస్తున్నారు. అక్కడ ఇసుకకు డిమాండు ఉన్నందున ఒక టిప్పర్ ఇసుక రూ.80వేల నుంచి లక్ష రూపాయల దాకా ధర పలుకుతోంది. దీంతో స్మగ్లర్లు రాత్రి వేళల్లో డంప్ల నుంచి ట్రాక్టర్లలో ఫిల్టర్ ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.స్మగ్లర్లకు రాజకీయ అండ వుండడంతో రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ అధికారులు కూడా పట్టనట్లే వ్యవహరిస్తున్నారు.