ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.92 లక్షలు హాంపట్
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:40 AM
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.92 లక్షలు పోగొట్టుకున్న బాధితుడి ఉదంతం
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.92 లక్షలు పోగొట్టుకున్న బాధితుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. స్థానిక కెనడీనగర్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరస్తులు కొందరు వాట్సాప్ కాల్ చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని ఆశచూపారు. పెట్టుబడికి రెండింతలు లాభం వస్తుందని నమ్మించారు. తాము సూచించిన అకౌంట్లకు నగదు పంపితే వడ్డీతో సహా తిరిగి వస్తుందని చెప్పి తొలుత దాదాపు రూ.10 లక్షలు వేయించుకున్నారు. ఆ తర్వాత వడ్డీతో సహా వేయాలంటే ఇంకా వేయాలని, లేనిపక్షంలో తొలుత పంపిన డబ్బు రాదని చెప్పారు. దీంతో గతనెల 10 నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దఫదఫాలుగా రూ.92 లక్షలను సైబర్ నేరగాళ్లు సూచించిన అకౌంట్లలో జమచేశాడు. తీరా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని ఆదివారం రాత్రి ఈస్ట్ స్టేషన్ను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.