Share News

ప్రమాదాల దారి

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:46 AM

పుత్తూరు నుంచి తిరుత్తణి వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి.రహదారి పనులు ఒక వైపు జరుగుతుండగా వాహన రాకపోకలు సాగుతున్నాయి.దీంతో రహదారి ఇరుకుగా మారడంతో అమిత వేగంతో వెళ్లే వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ప్రమాదాల దారి
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న మలుపు

హైవే విస్తరణ పనుల్లో భద్రతా లోపాలు

పుత్తూరు-తిరుత్తణి రూట్లో వరుస యాక్సిడెంట్లు

గత శనివారం కార్వేటినగరం నుంచి వస్తున్న కారును రామాపురం వద్ద బస్సు ఢీకొనడంతో ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు కారులో ఎయిర్‌బ్యాగ్‌ ఓపెన్‌ కావడంతో అందులో వున్న విద్యార్థులు, పీఈటీ మాస్టర్‌ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

ఫ పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం వద్ద గత ఆదివారం రాత్రి తమిళనాడు ఆర్టీసీ బస్సు రాంగ్‌ రూట్‌లో వస్తుండడంతో మోటారు సైకిల్‌పై వెళుతున్న యువకుడు అదుపు తప్పి నిర్మాణ దశలో ఉన్న కల్వర్టుపై పడ్డాడు.దీంతో కడుపులో ఇనుప మేకు గుచ్చుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికుల సహాయంతో 108 సిబ్బంది ఆ మేకు కత్తిరించి తిరుపతి రుయా వైద్యశాలకు తరలించారు.

నగరి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పుత్తూరు నుంచి తిరుత్తణి వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి.రహదారి పనులు ఒక వైపు జరుగుతుండగా వాహన రాకపోకలు సాగుతున్నాయి.దీంతో రహదారి ఇరుకుగా మారడంతో అమిత వేగంతో వెళ్లే వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.వాహనాల వేగ నియంత్రణకు, సూచిక బోర్డులు కానీ, బారికేడ్ల ఏర్పాటు కానీ చేపట్టని కారణంగా ఈ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది.నగరి సాయిబాబా ఆలయ సమీపాన రహదారి అంచుల్లో ఉంచిన ఇసుక బస్తాలు తరచూ జారిపోవడంతో వాటిలో నుంచి ఇసుక రోడ్డుపై పడడం.... వాహన దారులు గుర్తించక జారిపడడం జరుగుతోంది. టేక్‌ డైవర్షన్‌ బోర్డులను దగ్గరగా ఉంచడం వల్ల డ్రైవర్లు గమనించక పోవడం, హఠాత్తుగా మలుపు తీసుకోవడం వంటి కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయంలో రోడ్డు పక్కనే ఉన్న పల్లపు ప్రాంతాలు కనిపించకపోవడం వల్ల కూడా పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

ఫ ఇలా చేయాలి

తగిన దూరాల్లో అదనపు ‘టేక్‌ డైవర్షన్‌’ బోర్డులు ఏర్పాటు చేయాలి.

అవసరమైన రహదారి సూచన చిహ్నాలు, లైన్‌ మార్కింగ్స్‌, రెప్లెక్టింగ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి.

సూచిక బోర్డులు రాత్రి వేళలో కూడా కనిపించే రేడియంతో అమర్చాలి.

పనులు పూర్తయ్యే వరకు తాత్కాలిక బారికేడ్లు, హెచ్చరిక కోన్లు ఏర్పాటు చేయాలి.

భద్రతా నియమాల లోపం

పుత్తూరు-తిరుత్తణి జాతీయ రహదారి పనుల్లో భద్రతా నియమాలు పాటించడం లేదు.నగరి సాయిబాబా ఆలయ సమీపంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక బస్తాలు తరచూ జారిపోవడం, వాహన దారులు గుర్తించక జారిపడి ప్రమాదాలకు గురవడం జరుగుతోంది. రాత్రి సమయంలో రిప్లెక్టివ్‌ సైస్‌లు ఉండడం లేదు.వీటిపై నేషనల్‌ హైవే ప్రధాన అధికారికి లేక రాశాం.

- కె.వేలాయుధం,బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నగరి

Updated Date - Nov 12 , 2025 | 12:46 AM