రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:16 AM
ప్రభుత్వం ప్రజోపయోగ సంస్కరణలు తీసుకొస్తోంది.
రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం ప్రజోపయోగ సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సత్ఫలితాలు ఇచ్చింది. క్రయ, విక్రయదారులు ఎలాంటి నిరీక్షణ లేకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. తాజాగా వారసత్వ ఆస్తుల డాక్యుమెంటేషన్పై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి
ఆస్తి యజమాని మరణించాక వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన వాటికి యథావిధిగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. తల్లిదండ్రులు మరణించాక వారసత్వంగా వచ్చే ఆస్తుల మ్యుటేషన్లు (భూముల రికార్డుల్లో వివరాలు నమోదు) సకాలంలో జరగడంలేదని.. తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది తిప్పుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు తమ ఆస్తికి రిజిస్ట్రేషన్ ఎందుకు అన్న అపోహతో కొందరు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల మృతి చెందినవారి పేర్లే రికార్డుల్లో ఉండిపోతున్నాయి. ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి.
మరింత సులువు
సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ రూ.10 లక్షల్లోపు ఉంటే రూ.100, ఆపైన ఉంటే రూ.వెయ్యి.. స్టాంపుడ్యూటీగా తీసుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. యజమాని మరణించాక వచ్చిన ఆస్తులను వారసులు భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల మ్యుటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ-పా్సబుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్నవారి నుంచి ఈకేవైసీ తీసుకుంటారు.
కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి రద్దుచేసే అధికారం
రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగితే వాటిని రద్దుచేసే అధికారాన్ని కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి దాఖలు చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. రిజిస్ట్రేషన్ అక్రమంగా జరిగినట్లు ఫిర్యాదు అందితే జిల్లా రిజిస్ట్రార్ వాటిని పరిశీలిస్తారు. ఆధారాల ప్రాతిపదికన కమిటీకి సిఫార్సు చేస్తారు. ఆధారాలు పరిశీలించాక, అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దుచేసే అవకాశం ఉంది.