తిరుమలలో రజనీకాంత్
ABN , Publish Date - Dec 14 , 2025 | 02:11 AM
సూపర్స్టార్ రజనీకాంత్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి కుటుంబంతో ఆయన తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సూపర్స్టార్ రజనీకాంత్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి కుటుంబంతో ఆయన తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు యాత్ర, లింగ, బావమరిది, సంగీత దర్శకుడు అనిరుధ్ తల్లిదండ్రులు రవిచంద్రన్, లక్ష్మీలతో కలిసి క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశ్వీచనం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. రజనీకాంత్ తన బరువు 73 కేజీలకు సమానంగా బెల్లం, బియ్యం, చక్కెరతో తులాభారం మొక్కులు చెల్లించారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా దాదాపు 500 కేజీల తులాభారం మొక్కులు తీర్చారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల రజనీకాంత్ను చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు. ‘తలా, తలైవా, సూపర్స్టార్’ అంటూ కేకలు వేశారు. అభిమానులకు నమస్కరిస్తూ ఆయన ముందుకు సాగారు. కొందరితో కరచాలనం చేసి చిరునవ్వుతో పలకరించారు. కాగా భద్రతాసిబ్బంది రజనీకాంత్ను వాహనం వద్దకు తీసుకువెళ్లే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో సమీపంలో ఉన్న పండితుడు ఒకరు కిందపడ్డారు. గుర్తించిన భక్తులు ఆయన్ను వెంటనే పైకిలేపారు.