అంబేడ్కర్ విగ్రహంతోనా రాజకీయం?
ABN , Publish Date - Oct 12 , 2025 | 02:00 AM
రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుండడం చూసి ఓర్వలేక జగన్ అండ్ బ్యాచ్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.వెదురుకుప్పం మండలం దేవళంపేటలో రెండు వారాల క్రితం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ,దాన్ని టీడీపీ పైకి నెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించిన వైసీపీ నాయకుల కుట్రను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే.
కులాల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకోం
వైసీపీ నాయకులపై హోంమంత్రి అనిత ఫైర్
వెదురుకుప్పం/పెనుమూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుండడం చూసి ఓర్వలేక జగన్ అండ్ బ్యాచ్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.వెదురుకుప్పం మండలం దేవళంపేటలో రెండు వారాల క్రితం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ,దాన్ని టీడీపీ పైకి నెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించిన వైసీపీ నాయకుల కుట్రను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే.వైసీపీకి చెందిన సర్పంచ్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు చేసి జైలుకు పంపించారు.మరోవైపు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన రోజు సాయంత్రమే ఎమ్మెల్యేలు థామస్, మురళీమోహన్ అక్కడ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో శనివారం హోంమంత్రి అనిత దేవళంపేటకు వచ్చారు. జోరు వాన కురుస్తున్నా చిత్తూరు ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అక్కడే ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని సమాచారం రాగానే పోలీసులకు ఫోన్ చేసి వెంటనే దోషులను గుర్తించి వాళ్లు ఎవరైనా చర్యలు తీసుకోవాలని సూచించానన్నారు.చివరకు వైసీపీ నేతల కుట్ర అని తెలియడంతో ఆశ్చర్యపోయానన్నారు.డిప్యూటీ సీఎంగా పని చేసిన నారాయణస్వామి తమ దండుపాళ్యం బ్యాచ్తో వచ్చి టీడీపీ నేతలను అరెస్టు చేయాలని పోలీసులను కోరడంపై ఆమె మండిపడ్డారు.ఆయనకు వయసు పెరిగింది కానీ, బుద్ధి పెరగలేదని ధ్వజమెత్తారు.ధర్నాలు చేయడం, రెచ్చగొట్టడం, తగలబెట్టడం.... తీరా దొరికాక తమకేమీ తెలియదంటూ బుకాయించడం వైసీపీ నైజం అన్నారు.ఎక్కడైనా ఏవైనా జరగరాని సంఘటనలు జరిగినప్పుడు ఎలా జరిగింది, ఎవరు చేశారు అని నిర్ధారించుకున్నాకే కార్యాచరణకు దిగాలని దళిత సంఘాలకు ఆమె సూచించారు.అంబ్కేర్ విగ్రహానికి నిప్పు పెట్టి రాష్ట్ర సమస్యగా చేయాలనుకున్న వైసీపీ కుట్రను భగ్నం చేసి నిజానిజాలను ప్రజలకు తెలియజేసిన చిత్తూరు పోలీసులను హోంమంత్రి అభిందించారు.‘చిత్తూరులో గ్యాంగ్ రేప్ జరిగితే, ఆ నిందితుల్ని వెంటనే పట్టుకుని ముసుగు వేసి తీసుకెళ్లలేదు. బేడీలు వేసి నడి రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లారు’ అంటూ ఆమె పోలీసులకు కితాబునిచ్చారు.రాజకీయ ముసుగులో వున్న నేరస్తులను గుర్తించి కటకటాల వెనక్కు పంపాలని సూచించారు.జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ దళితుల ఓట్లతో గెలిచి డిప్యూటీ సీఎం దాకా ఎదిగిన నారాయణస్వామి తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానంటూ దళిత ఆత్మగౌరవాన్ని జగన్ కాళ్ల దగ్గర పెట్టిన ద్రోహి అంటూ మండిపడ్డారు.ఎక్సైజ్ మంత్రిగా ఇష్టానికి దోచుకుని కుమార్తెలకు పంచిపెట్టిన ఆయన దళితులతో రాజకీయం చేయాలని చూస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.వాళ్లు ఒక్క విగ్రహాన్ని కాల్చితే తాము వెయ్యి విగ్రహాల్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అండగా దళితులున్నారని గ్రహించిన వైసీపీ నేతలు ఎస్సీ నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ దుష్టపన్నాగాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక్కడ కాలిన మంట మరో చోటకు వ్యాపించకుండా ఉండాలంటే దోషులను శిక్షించడం మాత్రమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అందు కోసమే హోం మంత్రి దేవళంపేటకు వచ్చారన్నారు.మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ అన్ని జాతులవారూ కలిసి మొక్కాల్సిన దేవుడు అంబేడ్కర్ను కూడా నీచ రాజకీయాలకు వాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు.సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సీఆర్ రాజన్, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, మాజీ ఎమ్మెల్యే గాంధీ,తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు కార్జాల అరుణ,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ నాగేశ్వరరాజు, టీడీపీ నేతలు రుద్రయ్య నాయుడు, జయశంకర్ నాయుడు, స్వామిదాస్, లోకనాధరెడ్డి, చెంగల్రాయయాదవ్,మోహన్ మురళి,తలారి రెడ్డెప్ప, శ్రీధర్ యాదవ్,గుణశేఖర్, హరీ్షయాదవ్, మనోహర నాయుడు, ఇందిరమ్మ, రవిరాజు, తిరుమల, కుమార్, దశరథ, పీఏసీఎస్ చైర్మన్ సుధాకరరెడ్డి, ఎస్సీ మోర్చా నేత శేషాద్రికుమార్, ఎస్సీ సెల్ ఉపాఽధ్యక్షులు దశరథవాసు, పరమేశ్వరరెడ్డి, అశోక్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.