మంత్రి పీఏ చెప్పారు కదా.. షాపు ఇచ్చేయండి
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:35 AM
‘మంత్రి పీఏ చెప్పారు కదా.. ఇక్కడ కూడా షాపు ఇవ్వండి.. లేదంటే నేను సీఎం పీఏగా వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు నా అవసరం ఉంటుంది’ అంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా ఓ మహిళా వైద్యాధికారిణిపై ఒత్తిడి చేస్తున్నారు.
ఇప్పటికే రుయాలో అరకు కాఫీ షాపునకు లైసెన్స్
తిరుపతి- ఆంధ్రజ్యోతి
‘మంత్రి పీఏ చెప్పారు కదా.. ఇక్కడ కూడా షాపు ఇవ్వండి.. లేదంటే నేను సీఎం పీఏగా వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు నా అవసరం ఉంటుంది’ అంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా ఓ మహిళా వైద్యాధికారిణిపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల పీఏలతో సత్సంబంధాలు పెట్టుకుని వారితో ఫోన్లు చేయించి పనులు చేసుకోవడంలో దిట్టగా పేరున్న సదరు వ్యక్తి తిరుపతి ఎస్వీఆర్ రుయా ఆస్పత్రిలో ‘అరకు కాఫీ’ షాపు ఏర్పాటుకు అధికార యంత్రాంగం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు. ఆ మేరకు నామమాత్రపు అద్దెతో ప్రొసీడింగ్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఇదే వరసతో పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఎదుట కూడా అరకు కాఫీ షాపు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాఫీ షాపునకు అనుమతి ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మంత్రి పీఏతో ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేయించినట్టు తెలిసింది. ఇటీవల వైజాగ్ నుంచి ప్రసూతి ఆస్పత్రికి బదిలీపై వచ్చిన మహిళా వైద్యాధికారిణికి వచ్చీరాగానే ఈ వ్యవహారం ఎదురు కావడంతో ఆమె ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఒకే ప్రాంగణంలో రెండు షాపులు ఎందుకన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా తెలిసింది.
అరకుకు పెరుగుతున్న గిరాకీ
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు సహజ పద్ధతుల్లో సాగుచేసే అరకు కాఫీ ఖ్యాతి ఖండాంతరాలను దాటేసింది. ఈ క్రమంలో తిరుపతిలోనూ అరకు కాఫీ షాపులు వెలుస్తున్నాయి. ఆదివాసీల పేరుతో లైసెన్సులు తీసుకుని ఇతర వ్యక్తులు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. అరకు పేరు వాడుకుని ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది దర్జాగా వ్యాపారాలు చేసుకునేందుకు బడా వ్యక్తులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు ఈ షాపుల కోసం పెద్దయెత్తున దరఖాస్తులు వస్తున్నాయి.