చాపకింద నీరులా గంజాయి
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:50 AM
కారణాలు ఎన్ని ఉన్నా ఒకప్పటితో పోల్చుకుంటే జిల్లాలో గంజాయి వాడకం బాగా పెరిగింది. కూటమి ప్రభుత్వం నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, జిల్లాలో ప్రతి మండలంలోనూ గంజాయి లభిస్తోందంటే పరిస్థితులు అదుపు తప్పాయనేది తెలుస్తోంది. ఈ ఏడాది కాలంలోనే జిల్లాలో విపరీతంగా గంజాయి కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 235 కిలోల స్వాధీనం
టాస్క్ఫోర్స్ టీమ్తో ప్రత్యేక దాడులు
కారణాలు ఎన్ని ఉన్నా ఒకప్పటితో పోల్చుకుంటే జిల్లాలో గంజాయి వాడకం బాగా పెరిగింది. కూటమి ప్రభుత్వం నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, జిల్లాలో ప్రతి మండలంలోనూ గంజాయి లభిస్తోందంటే పరిస్థితులు అదుపు తప్పాయనేది తెలుస్తోంది. ఈ ఏడాది కాలంలోనే జిల్లాలో విపరీతంగా గంజాయి కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మన జిల్లాలో గంజాయి అమ్మకాలు, వాడకం విపరీతంగా పెరిగింది. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి గంజాయి తెచ్చుకుంటున్నారు. ఆమధ్యలో చిత్తూరు నగరంలో ఓసారి 15, మరోసారి 14 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 2014-19 సంవత్సరాల మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో 17 కేసుల్లో 62 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 169 కేసుల్లో ఏకంగా 1,166 కిలోల గంజాయిని పట్టుకున్నారు. అప్పట్లో 45 మందిని అరెస్టు చేస్తే, వైసీపీ హయాంలో 496 మంది అరెస్టయ్యారు. ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో 68 కేసుల్లో రూ.36 లక్షల విలువ చేసే 235 కిలోల గంజాయిని పట్టుకుని, 235 మందిని అరెస్టు చేశారు. ఈ స్థాయిలో కేసులు నమోదు చేశారంటే వాడకం కూడా అదే స్థాయిలో ఉందనే అర్థం వస్తోంది.
విద్యార్థులు, కూలీల వాడకం..
జిల్లా మీదుగా సరఫరాతోపాటు జిల్లావాసులు కూడా పెద్ద ఎత్తున గంజాయి వాడుతున్నారనే విషయం ఆందోళనకు గురి చేస్తోంది. చిత్తూరు, పలమనేరు, పుంగనూరు వంటి పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మండలాల్లో కూడా వాడకం పెరిగిందని పోలీసులు లెక్కలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో అయితే గంగవరం, కుప్పం, పెద్దపంజాణి, రామకుప్పం, వి.కోట వంటి ప్రాంతాల్లో గంజాయి మొక్కల్ని సాగు కూడా చేసేవారు. విద్యార్థులు పెద్దఎత్తున గంజాయిని వాడుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో రోజువారి కూలీలున్నారు. గంజాయిని కట్టడి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. సివిల్ డ్రెస్సులు ధరించిన పోలీసులు రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ఈగల్ క్లబ్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం..
గంజాయిని ఆరు నెలల్లో లేకుండా చేస్తామని గతేడాది నవంబరులో ప్రకటించిన ప్రభుత్వం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్)ను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలూ జిల్లాలో ప్రారంభం కాలేదు. పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో క్లబ్లో ఉపాధ్యాయులు/ అధ్యాపకులు, విద్యార్థులు కలిపి మొత్తం 10 మంది సభ్యులుగా ఉండాలి. వీటి ఏర్పాటుపై ఎవరూ దృష్టి సారించడం లేదు. నేటికీ చాలా విద్యాసంస్థల్లో ఇవి ఏర్పడలేదు.
అప్పట్లో వైసీపీ.. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు
వైసీపీ హయాంలో ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు గంజాయి అమ్మకాలు చేపట్టి సొమ్ము చేసుకోగా.. ఇప్పుడు ఆ పనిని టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారు. గతేడాది నవంబరులో గంగవరంలో పోలీసులు దాడిచేసి గంజాయిని పట్టుకోగా, టీడీపీ కార్యకర్త దొరికారు. ఈమధ్య చిత్తూరులో కూడా టీడీపీ కార్యకర్తల మధ్య గంజాయి అమ్మకాల కోసం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే, గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే బయటి రాష్ట్రాల కూలీలు కూడా అమ్మకాలు, వాడకం చేస్తున్నారు. తాజాగా గుడిపాలలోని ఓ ఫ్యాక్టరీలో గంజాయి అమ్ముతున్న కూలీని పోలీసులు పట్టుకున్నారు.
2014-19 టీడీపీ హయాంలో..
కేసులు: 17
నిందితులు: 45
పట్టుబడింది: 62 కిలోలు
ఫ 2019-24 వైసీపీ హయాంలో..
కేసులు: 169
నిందితులు: 496
పట్టుబడింది: 1,166 కిలోలు
ఫ 2024 నుంచి.. (ఒక ఏడాదిలో..)
కేసులు: 68
నిందితులు: 194
పట్టుబడింది: 235 కిలోలు