పర్మిట్ల కోసం మామిడి రైతుల రాస్తారోకో
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:40 AM
గుజ్జు పరిశ్రమ యాజమాన్యం పర్మిట్లు ఇవ్వకపోవడంతో సోమవారం ఉదయం మామిడి రైతులు చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నలగాంపల్లె వద్ద రాస్తారోకో నిర్వహించారు.
బంగారుపాళ్యం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): గుజ్జు పరిశ్రమ యాజమాన్యం పర్మిట్లు ఇవ్వకపోవడంతో సోమవారం ఉదయం మామిడి రైతులు చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నలగాంపల్లె వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము పండించిన మామిడిని అమ్ముకోలేక ఫ్యాక్టరీలు వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా యాజమాన్యాలు పట్టించుకోవడంలేదన్నారు. నలగాంపల్లెలోని సన్ గోల్డ్ గుజ్జు పరిశ్రమ యాజమాన్యం రైతులకు పర్మిట్లు ఇస్తామని ప్రకటించడంతో సోమవారం ఉదయం పెద్దఎత్తున రైతులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. కొందరికే పర్మిట్లు ఇస్తామని చెప్పడంతో రాస్తారోకోకు దిగారు. సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో సంఘటన చేరుకుని రైతులకు నచ్చజెప్పి, రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం గుజ్జు పరిశ్రమ యాజమాన్యంతో తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, సీఐ కత్తి శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడి మామిడి రైతులకు పర్మిట్లను మంజూరు చేయించారు.