‘నేతన్న’ల కుటుంబాల్లో వెలుగు
ABN , Publish Date - Mar 18 , 2025 | 01:36 AM
ఇళ్లకు 200.. మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు మంత్రి మండలి నిర్ణయంతో వేలాది మందికి లబ్ధి
మగ్గం కదలనుంది. వస్త్రాన్ని నేయనుంది. చేనేత కుటుంబంలో వెలుగులు నింపనుంది. ‘నేతన్న’ల ఇళ్లకు 200 యూనిట్ల వరకు.. మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని వేలాది చేనేత కార్మిలకు ప్రయోజనం కలగనుంది.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
ఉమ్మడి చిత్తూరుజిల్లాలో మదనపల్లె, నగరి, పుత్తూరు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మరమగ్గాలు నడుస్తున్నాయి. వెంకటగిరి, నారాయణవనం, మదనపల్లె ప్రాంతాల్లో చేనేత మగ్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మదనపల్లె పట్టణంలో సుమారు 4వేల వరకు మరమగ్గాలు నిర్వహిస్తున్నారు. అలాగే నగరిలో 5వేలు, పుత్తూరులో 2వేలు చొప్పున ఉన్నాయి. ఈ 11వేల మరమగ్గాలకు సంబంధించి ఎక్కువ మంది యజమానులకు ఉచిత విద్యుత్తు రూపంలో ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. అదే విధంగా మదనపల్లెలో 5వేలు, వెంకటగిరిలో 2వేలు, నారాయణవనంలో 1200 చొప్పున ఉమ్మడి చిత్తూరుజిల్లాలో ఎనిమిది వేలకు పైగా చేనేత మగ్గాలు పనిచేస్తున్నాయి. ఈ చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు వరకు విద్యుత్తు ఉచితంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఊరట కలిగించనుంది. గత ఎన్నికల్లో చేనేత వర్గాలకు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా ప్రయోజనం కలిగించే ఈ నిర్ణయం పట్ల జిల్లాలోని చేనేత కార్మికుల కుటుంబాలు, మరమగ్గాల యజమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం చేనేత రంగం కోలుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆ వర్గాలు సంబరపడుతున్నాయి.