చేనేతే జీవితంగా..!
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:15 AM
చిన్నప్పుడే చేనేతపై దృష్టి పెట్టారు. ఇందులో నైపుణ్యం సాధించి.. రాణిస్తూనే ఐటీఐ మెకానికల్ డ్రాఫ్ట్స్మేన్ కోర్సు పూర్తి చేశారు. శ్రీహరికోటలో ఓ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత పూర్తి సమయాన్ని చేనేత పనికే కేటాయించారు.
వెంకటగిరి నేతన్న శ్రీనివాసులుకు రెండోసారి సంత్ కబీర్ అవార్డు
వెంకటగిరి, జులై 10 (ఆంధ్రజ్యోతి): చిన్నప్పుడే చేనేతపై దృష్టి పెట్టారు. ఇందులో నైపుణ్యం సాధించి.. రాణిస్తూనే ఐటీఐ మెకానికల్ డ్రాఫ్ట్స్మేన్ కోర్సు పూర్తి చేశారు. శ్రీహరికోటలో ఓ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత పూర్తి సమయాన్ని చేనేత పనికే కేటాయించారు. చీరలపై జాందాని వర్కు చేయడంలో ప్రావీణ్యం సాధించారు. ఇలా చేనేతనే జీవితంగా మార్చుకుని.. పూర్తి సమయం కేటాయించారు వెంకటగిరికి చెందిన నేతన్న లక్కా శ్రీనివాసులు. అందుకే ఇప్పుడు రెండోసారి ఆయన సంత్ కబీర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ‘దేశంలో ఎక్కడాలేని జాందాని పనిపై దృష్టి సారించా. ఆపోజిట్ ఎగస్టావర్స్ ఇంటర్లాక్ సిస్దం విధానాన్ని మగ్గంపై ఉంచి చీర్లపై అద్భుతమైన డిజైన్లు సృష్టించా. 2013లో గోకుల బృందావనం అనే వాల్ హ్యాగింగ్ నేయగా.. అది జాతీయ అవార్డుకు ఎంపికైంది. 2015లో ఈ అవార్డును ప్రధాని చేతుల మీదుగా అందుకున్నా. భగవద్గీత శ్లోకాలను చీరపై నేసి ఇస్కాన్ టెంపుల్కు అందించా. గతంలో చీర నేచేది ఒకరు.. అవార్డు పొందేది మరొకరుగా ఉండేది. ఆ విధానంపై నేను అప్పటి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లి అర్హులకే అవార్డు అందేలా పరీక్షా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు అవార్డుకు ఎంపికైన ‘లక్ష్మీ వృక్షం’ చీర తయారు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టింది. దీంతో పాటు మరో రెండు చీరలు పంపినా, అవి అర్హత సాధించలేదు’ అని లక్కా శ్రీనివాసులు వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇలాంటి అద్భుతాలు మరెన్నో చేసి చూపుతామన్నారు.
సంత్ కబీర్ అవార్డుకు ఎంపికైన ‘లక్కా’కు సన్మానం
వెంకటగిరి టౌన్(ఆంధ్రజ్యోతి): ‘సంత్ కబీర్’ జాతీయ అవార్డుకు ఎంపికైన వెంకటగిరి బొప్పాపురం సాలికాలనీకి చెందిన లక్కా శ్రీనివాసులును గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సన్మానించారు. సంత్ కబీర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. వెంకటగిరి చీరలకు ప్రపంచ ఖ్యాతి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు, టీడీపీ నాయకులు బీరం రాజేశ్వరరావు, శ్రీరామదాసు గంగాధర్, పోలంరెడ్డి వెంకటరెడ్డి, అవ్వారు శ్రీనివాసులు, చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.